కథ... శ్యామలారావు ఉరఫ్ శ్యామ్ (రాహుల్) ఓ అనాధ. గొప్ప చిత్రకారుడు. వాళ్ల పొరిగింటిలో కమల (సింధుమీనన్) ఉంటుంది. శ్యామ్కు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటుంది. కోపమొస్తే కొడుతుంది. అంత చనువుగా మెలిగే ఇద్దరు మంచి మిత్రులు. కానీ ఆమె మూగది. హోర్డింగ్లకు పెయింటింగ్లు వేసే శ్యామ్కు స్వప్న (సోనాల్ చౌహాన్) పరిచయమవుతుంది.
తను భీమవరంకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు రామ్మూర్తి దీక్షితుల కుమార్తెనని చెబుతుంది. ఇకపోతే... స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే రామ్మూర్తి కెమెరా ముందు నటించలేక అవమానానికి గురవుతాడు. చివరికి ఆ దిగులుతోనే చనిపోతాడు. తండ్రి కోరికను తను సార్థకం చేయాలని స్వప్న హైదరాబాద్ వస్తుంది.
బాబాయ్ అయిన జూనియర్ ఆర్టిస్ట్ల్లో సీనియర్ అయిన నారాయణ (ఎం.ఎస్. నారాయణ) ఇంట్లో చేరుతుంది. స్వప్న అగ్రనటి కావాలనే ఆశయానికి శ్యామ్ చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమెను గుర్తింపు తెచ్చే స్థాయికి తనకు చేతనైన సాయం చేస్తాడు. ఓసారి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో శ్యామ్ తలకు తీవ్రమైన గాయం తగులుతుంది.
దానివల్ల కంటి నరాల్లో కలర్స్ను గుర్తించే నరాలు బ్లాక్ అయి " ఆక్సిమ్టోమ్స్" అనే కళ్లవ్యాధి వచ్చిందని డాక్టర్ ప్రకాష్ రాజ్ చెబుతాడు. దానివల్ల జీవితంలో కలర్స్ గుర్తించలేవని డాక్టర్ అంటాడు. అంతా నలుపు, తెలుపుగానే లోకాన్ని చూసే శ్యామ్ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచేస్తాడు.
మరోవైపు శ్యామ్ చేసిన ఓ పనివల్ల స్వప్నకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రంలో హీరోయిన్ అవకాశం వస్తుంది. దాంతో ఆమె పెద్ద స్టార్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఆమె జీవితమే మారిపోతుంది. ఆ టైమ్లో శ్యామ్ ఇన్నాళ్లు మనసులో దాచుకున్న ప్రేమను ఆమెకు వ్యక్తం చేస్తాడు.
అయితే నిన్ను ఎప్పుడూ ఆ దృష్టిలో చూడలేదని స్వప్న షాక్ ఇస్తుంది. ఆ తర్వాత శ్యామ్ పరిస్థితి ఏమిటి? ఆ తర్వాత శ్యామ్ తనవల్లే కళ్ల జబ్బు వచ్చిందని తెలుసుకున్న స్వప్న ఏం చేసింది? వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే కమల స్థితి ఎలా ఉంది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ... ముందుగా ఈ చిత్ర కథను సమకూర్చిన బలభద్రపాత్రుని రమణిని గురించి చెప్పుకోవాలి. ఆమె గతంలో పలు నవలలు రాసింది. కానీ సినిమాపరంగా మటుకు కథ అందించడం ఇదే మొదటి సారి. ఇక ఈ కథైతే నవలారూపేణా బాగుండేది. సినిమా పరంగా చూసే సరికి గతంలో "శివరంజని", "రాజా", "రంగీలా" వంటి ఎన్నో చిత్రాలు గుర్తుకు వస్తాయి.
జీవితం అందమైన హరివిల్లు. దానికి ముందు అంతా నలుపు, తెలుపు ప్రపంచమే. ఏది జరిగినా జీవితాన్ని ఆస్వాదించుకుంటూ ముందుకు సాగడమనే సందేశాన్ని ఈ "రెయిన్ బో" చెబుతుంది. తన జీవితంలో జరిగిన సంఘటన రంగుల ప్రపంచం (సినిమాలో) జరిగితే ఎలా ఉంటుందనేది క్లైమాక్స్లో దర్శకుడు శ్రీనువైట్ల స్వప్నచేత చేయిస్తాడు.