పాయింట్... హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం టైటిల్ పెట్టి తీసిన హిందూ ముస్లిం ప్రేమకథ ఇది. మాల్గుడి కథలు తరహాలో దర్శకుడు ఓ చిన్న పాయింట్ తీసుకుని తీసిన చిత్రం ఇది. కాదు... కాదు.... డాక్యుమెంటరీ అంటే బెటర్. ఓ డాక్యుమెంటరీని సినిమాగా చూపించే ప్రయత్నం చేశారు.
కథలోకి వెళితే... అక్బర్ (కమల్ కామరాజు) దేవరకొండ అనే గ్రామంలో ఆటోడ్రైవర్. పాలప్యాకెట్లు, పేపర్లు సైకిల్పై వేస్తూ దినచర్య ప్రారంభిస్తాడు. అతనొక అనాథ. ముస్లిం అయిన ఓ వ్యక్తి అక్బర్ను పెంచుకుంటాడు. చదువు సంధ్యల్లో అక్బర్ కాస్త పూర్. ఎలాగో డిగ్రీదాకా వచ్చి మూడుసార్లు తప్పుతాడు.
పగలంతా ఆ ఊరిలో ఆటోడ్రైవర్గా ఉంటూ... రాత్రిళ్లు బి.కాం. కోసం కుస్తీపడుతుంటాడు. ఊరిపెద్ద మాస్టార్జీ (రామ్ రమేష్) ఆటో ఓనర్. ఈ నేపథ్యంలో... ఆ ఊరిలో ఓ ఆచార వ్యవహారాల బ్రాహ్మణ కుటుంబం దిగుతుంది. హోటల్ పెట్టి ఆవకాయ పచ్చళ్ల వ్యాపారం చేయాలనుకుంటాడు ఆ ఇంటిపెద్ద.
ఆయన కూతురు లక్ష్మి (బింధు మాధవి). తనే ఆవకాయపచ్చళ్లు తీసుకుని సిటీలో తిరిగినా అమ్ముడు పోవు. మరోవైపు ఆ ఊరిలో కరెంటు, నీరు వంటి సరైన సదుపాయాలు లేకపోయినా... తిట్టుకుంటూ కాలం గడుపుతారు ఆ ఊరి ప్రజలు. ఓ రోజు మాస్టార్జీ.. తమ ఊరికి ముఖ్యమంత్రి వస్తున్నారంటూ... ఊరివారిచేత శ్రమదానం చేయిస్తాడు.
ముఖ్యమంత్రి వచ్చి సుందరంగా ఉన్న దేవరకొండను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ప్రకటిస్తాడు. అందరూ చప్పళ్లు కొడతారు. కానీ అక్బర్ లేచి... ఊరిలో ఉన్న సమస్యలు ఏకరువు పెడుతూ... కనీసం చదువుకోవడానికి పాఠశాలలను, రోడ్లను, మరుగుదొడ్లను, నీటి సదుపాయాలను కల్పించండి అంటూ... విజ్ఞప్తి చేస్తాడు.
ఈ హఠాత్ పరిణామానికి ఊరిపెద్ద ఆగ్రహించి తనను అవమానపర్చినందుకు ఊరినుండి అక్బర్ను వెలివేస్తాడు. తెల్లవారితే ఊరు వదలి వెళ్లిపోవాల్సిన తరుణంలో... అప్పటికే ముఖ్యమంత్రి చేసిన ఏర్పాట్లతో ఊరికి రోడ్లు, మంచినీటి వసతుల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమవుతారు.
దీంతో ఊరంతా అక్బర్కు జిందాబాద్ కొడుతుంది. ఇక చేసేదేమీ లేక అక్భర్ను ఇక్కడే ఉండమని ఊరిపెద్ద అంటాడు. కానీ ఎలాగైనా అక్బర్ను వదిలించుకోవాలని, ఊరిపెద్ద ఓ ప్లాన్ వేస్తాడు. బిందు అక్బర్తో చనువుగా ఉండడాన్ని అదే ఊరిలో ఉన్న మరో ముస్లిం సహించలేకపోతాడు.