పాయింట్.. జాతకం కన్నా విల్పవర్ గొప్పదనే చెప్పే అంశం.
ఈ సినిమా చూశాక టైటిల్ "మిత్రుడు" అని పేరు పెట్టారో అర్థంకాదు. కథాబలంలేని సాగదీతగా సాగే ఈ చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ నటించిన "కలియుగ పురుషుడు" ఛాయలు కన్పిస్తాయి. జాతక బలంపై చాలా చిత్రాలూ వచ్చాయి. కానీ నేటి ట్రెండ్కు తగినట్లుగా లేకపోవడం మైనస్సే.
కథలోకి వెళితే.. మలేషియాలో ఉంటున్న ఆదిత్య (బాలకృష్ణ), తన వారినందరినీ పోగొట్టుకున్న దుఃఖంలో మందుకొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తిని అక్కడే చదువుతున్న ఇందు (ప్రియమణి) బలవంతంగా ప్రేమిస్తుంది. దానికీ ఓ కారణముంటుంది. తన జాతకచక్రం ప్రకారం మొదటి మొగుడు చనిపోతాడు.
అందుకే ఎలాగూ జీవితంపై విరక్తి కలిగిన ఆదిత్యను ట్రాప్చేసి పెళ్ళి వరకు తెస్తుంది. ఆ తర్వాత అక్కడే పరిచయమైన మధు (దీపక్)ను ఎంచక్కా పెండ్లిచేసుకోవచ్చునన్నది ఆమె ప్లాన్. ఈ విషయాన్ని తన నాన్న రంగనాథ్కు కూడా చెప్పకుండా చేసుకుంటుంది. పెళ్ళయిన తర్వాత మధుతో ఇండియా బయలుదేరుతుంది ఇందు.
ఎలాగో విషయం తెలుసుకున్న ఆదిత్య, మధు, ఇందులతోనే వచ్చి షాక్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి రకరకాల ట్విస్ట్లతో కథ సాగుతుంది. అనాధగా మిగిలిన ఆదిత్యను అల్లుడిగా ససేమిరా అంటాడు రంగనాథ్.
ఈలోగా అక్కడ జరిగే కొన్ని సంఘటనలతో ఇందు ఆదిత్యపై ప్రేమ పెంచుకుంటుంది. మరి మధు ఇందుకు ఊరకుంటాడా? ఆస్తి కోసం ఎంతో ప్లాన్చేసి ఇందును ప్రేమించిన మధు ఎవరు? ప్రదీప్ రావత్ పాత్ర ఏమిటి? జాతక ప్రకారం ఆదిత్య చనిపోయాడా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ.. బాలకృష్ణ పాత్ర ఆసక్తికరంగా లేదు. అందర్నీ కోల్పోయిన వ్యక్తిగా చాలా నిరుత్సాహంగా సాగుతుంది. ఎంతో ఎత్తున్న భవనంపై ఫుల్బాటిల్ తాగేసి ఓ అమ్మాయి ఛాలెంజ్ను స్వీకరించే సీన్ పండలేదు. తాగినా అక్కడ నార్మల్గా కన్పించడం దర్శకుడి ప్రతిభకు తార్కాణం.
ద్వితీయభాగంలో పల్లెటూరి ఫ్లాష్బ్యాక్లో కాస్త పర్వాలేదనిపిస్తుంది. సరైన కథాలోపంతో పాత్రలో పట్టు లోపించింది. ఇక ప్రియమణి పాత్రమేరకు పర్వాలేదు. మంత్రిగా ప్రదీప్రావత్ నటించాడు. అసలు రంగనాథ్కు ఇతనికి ఎందుకు వైరమో అర్థంకాదు. తన కుమారుడిని ఇందును చేసుకోవడమనేది కారణంగా కన్పిస్తుంది.
జానాబెత్తుడు జాన్గా బ్రహ్మానందం కాస్త నవ్విస్తాడు. ఇక కృష్ణభగవాన్ పాత్ర మలేషియాలో మొదలై రాజమండ్రిలో తేలుతుంది. ఇతను లాయర్ అనేది ట్విస్ట్. రంగనాథ్ స్నేహితునిగా మేకవన్నెపులిగా తొలిసారిగా చంద్రమోహన్ విలనిజం చేశాడు. ఇది ఆయన పాత్రలో ట్విస్ట్.
ఇక మిగిలిన పాత్రలన్నీ అలా కన్పించి వెళ్ళి పోయేవే. చివరిగా కృష్ణభగవాన్ వచ్చి మీరు చెప్పిన అల్లుడినే అమ్మాయి కోరుకుందనే ట్విస్ట్ ఇస్తాడు. ఇలా రకరకాల ట్విస్ట్లతో కథసాగుతుంది.
ఎవరికీ పెద్దగా డైలాగ్లుండవు. అసలు ఇటువంటి కథలు బాలకృష్ణ ఎలా అంగీకరించాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. "ఒక్కమగాడు" చిత్రం చూశాక ప్రేక్షకుడికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాగే సినిమాను చూస్తేనూ కలుగుతుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా కథను మలుచుకోవడం, మలచడం అనేది పెద్ద ఆర్ట్. అది నిర్మాత, దర్శకులూ ఇద్దరూ గమనించాలి. ఒక్కోసారి కథ చెప్పినంతగా చిత్రాన్ని తీయకపోవచ్చు. మరి "మిత్రుడు" ఏ కోవకు చెందిందో ప్రేక్షకులే తేల్చాలి.