పాయింట్... నాయకులకు, ప్రజాసేవలకు ఓటువేయండని చెప్పే చిత్రం.
ఇది మరో రాజకీయ చిత్రం. సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని పాలకుల్ని నిలదీసే దర్శకుడు పోసాని కృష్ణ మురళీ. పౌరుడికున్న సందేహాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తాయి. ప్రభుత్వాధికారుల్లో అవినీతి, రాజకీయాల్లో నీతి లేదని చెప్పే చిత్రాల కోవలో ఈ చిత్రమూ వస్తుంది.
నాయకులు అసత్యాలు పలికి ఆడిన మాటను వెనక్కి తీసుకుంటే ఒప్పు, సామాన్యుడు అబద్ధం ఆడితే తప్పా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించి ఇదెక్కడి న్యాయం? అంటూ నిలదీస్తాడు. ఆఖరికి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి? అంటూ ముగిస్తాడు.
ఇక కథలోకి వెళితే.. రాజా (పోసాని) సిన్సియర్ సబ్ఇన్స్స్పెక్టర్. తన సర్కిల్ పరిధిలో శ్రీను అనే వ్యక్తి తనను ప్రేమించడం లేదని లక్ష్మీ అనే కాలేజీ యువతిపై కాలుతున్న తారును పోసి కళ్ళను పోయేలా చేస్తాడు. ఇది చూసిన మరో కాలేజీ అమ్మాయిని ఆస్పత్రి పాలు చేస్తాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనుకు ఎమ్మెల్యే సహకరిస్తాడు.
ఎమ్మెల్యే తమ్ముడని విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన లాజిక్కులతో శ్రీనును అరెస్ట్ చేసి, శ్రీను కళ్ళు ఆ యువతికి అమర్చేలా చేస్తాడు. మీడియా అంతా రాజాను సపోర్ట్ చేయడంతో రాజాకు ఇమేజ్ పెరుగుతుంది. ఎమ్మెల్యే పదవీచ్యుతుడవుతాడు. అనంతరం అతని తండ్రి కోటశ్రీనివాసరావు అప్పుడే జరిగే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా నిలబడతారు. ఇతనికి పోటీగా శివప్రసాద్ (గిరిబాబు) ప్రజాసేవకుడిగా నిలబడతాడు. ఈ క్రమంలో కోటశ్రీనివాసరావు తప్పుల్ని రాజా వెలికితీసి అతని పరువు పోయేలా చేస్తాడు. ఆ అవమానంతో ఆత్మచేసుకుంటాడు కోటశ్రీనివాసరావు. అనుకున్నట్లు చనిపోతాడు. దీంతో రాజా పోలీసు ఉద్యోగం కాస్త ఊడుతుంది.
తర్వాత ఏదో చేయాలని చేపలచెరువు వ్యాపారానికి ఉపక్రమిస్తాడు. ఆ క్రమంలో ఎంతో మంది ప్రభుత్వఉద్యోగులకు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. అనుకున్నట్లు చేపల చెరువు పెడతాడు. కానీ ఓ రోజు తన చేపల చెరువును ఎవరో కిడ్నాప్ చేశారని, దానికోసం ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ.. కొత్త సమస్యను పోలీసుల ముందుంచుతాడు. అసలు చేపల చెరువు కిడ్నాప్ కావడం ఏమిటి? ఆ తర్వాత పోసాని ఏం చెప్పదలచుకున్నాడు. అన్నది మిగిలిన సినిమా.