గతంలో భారతీయుడు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన మర్మకళ నేపథ్యంలో ముమైత్ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త చిత్రమే టార్గెట్. శివబాలాజీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మర్మకళను ఉపయోగించి ఓ బాక్సర్ను చంపేయడం, ఆ హత్యకు సంబంధించి సాగే సస్పెన్స్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడం విశేషం.
పాయింట్: మర్మకళ ప్రయోగంతో చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించిన కేసును హీరో పరిశోధించడం.
కథ: మందాకిని (ముమైత్ఖాన్) ఓ నవలా రచయిత. ఆమె రాసిన ఎర్రగులాబి నవలలోని కథలో జరిగినట్టుగానే ఓ బాక్సర్ చనిపోతాడు. దీంతో ఆ నవల పాపులర్ అవుతుంది. అయితే నవలలో జరిగనట్టుగానే మర్మకళ ఉపయోగించడం వల్లే నిజమైన బాక్సర్కూడా చనిపోవడంతో ఇందులో ఆ రచయిత్రి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులకు అనుమానం వస్తుంది.
దీంతో పోలీస్ కమీషనర్ ఈ కేసును బోస్ (శివబాలాజీ)కి అప్పగిస్తాడు. కమీషనర్ కోరిక మేరకు చనిపోయిన బాక్సర్ హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు బోస్ మందాకినికి దగ్గరవుతాడు. అయితే తాను అనుకున్నట్టు మందాకినినే ఈ హత్య చేసింది అనేందుకు తగిన ఆధారాలేవీ బోస్కు లభించవు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఈహత్య ఎవరు చేశారు. ఎందుకు చేశారు. ఈ హత్యను మందాకినీనే చేయించిందా అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ: ఈ చిత్రంలో ముమైత్ఖాన్ ఫుల్లెంగ్త్ పాత్ర పోషించింది. కథను సస్పెన్స్గా సాగించడానికి ముమైత్ గ్లామర్ బాగానే ఉపయోగపడింది. ఈ చిత్రంలో శివబాలాజీ పోషించిన పోలీస్ పాత్ర ఎందుకో అంతగా ఆకట్టుకోదు. ఈ పాత్రకు తగినట్టు తనను తాను మలచుకోవడంలో శివబాలాజీ ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు. ముమైత్కు, శివబాలాజీకి మధ్య కథ నడిచేటప్పుడు మధ్యలో శ్రద్దాదాస్ వచ్చినా ఆమె అందాల ఆరబోతకే పరిమితమైంది.
ఈ మూడు పాత్రలకు మధ్యలో రొటీన్ కామిడోతో కృష్ణభగవాన్, కొండవలస, వేణుమాధవ్లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదేసమయంలో విలన్ చేత కామెడీ చేయించాలనుకున్న ప్రయత్నం సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. చిత్రానికి ముందు రచయిత వెలిగొండ శ్రీనివాస్ చెప్పినంత ఎఫెక్టీవ్గా ఈ చిత్రం అనిపించకపోవడం ప్రధాన లోపం. టెక్నికల్గా ఏమాత్రం వ్యాల్యూలేని ఈ టార్గెట్ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి.