ఆంధ్రప్రదేశ్లో జలపాతాలకు కొదవలేదు. వివిధ జలపాతాలున్న ఈ ప్రదేశాలు కేవలం పర్యాటక ప్రాంతాలనే కాక శివక్షేత్రాలుగా కూడా విలసిల్లుతున్నాయి. అలాంటి కోవలోనే చిత్తూరు జిల్లాలోని పుత్తూరు సమీపంలో ఉన్న కైలాసనాథ కోన జలపాతం గురించి చెప్పుకోవచ్చు.
చెన్నై, తిరుపతి మార్గంలో ఉన్న ఈ జలపాతం ప్రధాన రహదారి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రధాన రహదారి నుంచి జలపాతం సమీపం వరకు రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం ఉండడం ఈ ప్రదేశానికి సంబంధించిన విశేషం.
వారంలోని అన్ని రోజులు ఈ ప్రదేశానికి పర్యాటకుల తాకిడి ఉంటున్నా ప్రతి ఆదివారం పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైతో సహా చుట్టుప్రక్కల ప్రదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.
జలపాతం విశేషాలు చుట్టూ ఎత్తైన కొండలు, గలగలమని దుమికే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ పైనుంచి జాలువారే జలపాతంలో రోజంతా తడవడం, దగ్గర్లోనే ఉన్న చిన్న గుహలో కైలాసనాథునిగా వెలసిన శివుని దర్శించుకోవడం పర్యాటకులకు ఓ చక్కని అనుభూతిని మిగులుస్తుంది.
|