ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పర్వత ప్రాంతాలు » వెనీస్ ఆఫ్ ద ఈస్ట్.. కాశ్మీర్ ఆఫ్ రాజస్థాన్.. "ఉదయ్‌పూర్" (Mountains | Venice of the East | Kashmir of Rajasthan | Lake City | Udaipur | Aravali Mountains | Lake)
Feedback Print Bookmark and Share
 
Rajastan
FILE
"సజ్జన్ నివాస్ గార్డెన్" రాజస్థాన్‌లోని ఉద్యానవనాల్లోకెల్లా అతి పెద్దది. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ తోటలో గులాబీ పువ్వులే ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని రోజ్ గార్డెన్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ఒక జూ కూడా ఉంది. పిచోలా సరస్సు ఒడ్డున ఉన్న ఈ గార్డెన్‌లో విహరించేందుకు పర్యాటకులు చాలా ఇష్టపడుతుంటారు.

"సహోలియోంకీ బారీ" ఉద్యానవనం.. 18 శతాబ్దంలో మహారాణా సంగ్రామ్ సింగ్ తన భార్య కోసం దీన్ని రూపొందించాడు. తరువాత ఆమె తన 48 మంది దాసీలకు అప్పగించింది. ఇది ఫతే సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ గార్డెన్‌లోని ప్రవేశ ద్వారాలు, వాటిపైనగల సూక్ష్మ చిత్రకళ సందర్శకులను అబ్బురపరుస్తాయి.

ఉదయ్‌పూర్ మరో ఆకర్షణ "అహర్". దీన్నే మేవాడ్ రాజపుత్రుల స్మృతి చిహ్నం అనవచ్చు. స్థానికులకు రాజపుత్ర రాజులంటే ఎంతో గౌరవం. అందుకే ఇక్కడ ఎంతోమంది రాజపుత్రవీరుల సమాధులున్నాయి. సమాధి అంటే ఏదో మామూలు సమాధి అనుకోకండి. ఒక్కోటి ఓ చిన్నసైజు కోటలాగా ఉంటుంది. పాలరాతితో నిర్మించిన ఈ సమాధుల్లో కూడా చిత్రకళ ఉట్టిపడుతూ ఉంటుంది.

ఉదయ్‌పూర్‌కు సమీపంలోగల "సజ్జన్‌గఢ్ ప్యాలెస్" కూడా చూడదగ్గదే. ఇక్కడినుంచి చూస్తే ఉదయ్‌పూర్‌లోని ఐదు సరస్సులూ దర్శనమిస్తాయి. ఇక్కడకు వర్షాకాలంలో పర్యటిస్తే బాగుంటుంది. ఎందుకంటే, సరస్సులన్నీ నీటితో కళకళలాడుతుంటే చూసే దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. అందుకే.. ఈ ప్యాలెస్‌ను "మాన్‌సూన్ ప్యాలెస్" అని కూడా పిలుస్తుంటారు. దీనికి దగ్గర్లోనే "సజ్జన్‌గఢ్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం" ఉంది.

అలాగే ఉదయ్‌పూర్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో "కుంభాల్‌గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం" ఉంది. 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో.. పులులు, చిరుతలు, లేళ్లు, కుందేళ్లు, కోతులు, అనేక రకాల పక్షులు ఉన్నాయి. ఇక ఉదయ్‌పూర్‌కు 22 కి.మీ. దూరంలో "ఏకలింగనాథ ఆలయం".. 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న "నాథ ద్వారం".. రాజ్‌సమంద్ సరస్సు ఒడ్డున ఉండే "శ్రీకృష్ణుడి ఆలయం"..తదితరాలు కూడా చూడదగ్గవే.

ఉదయ్‌పూర్ పర్యటనకు అక్టోబర్-ఏఫ్రిల్ నెలల మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే వర్షాకాలంలో వానలూ ఎక్కువే అయినప్పటికీ.. సరస్సులన్నీ నీటితో కళకళలాడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

ఇక్కడికి వెళ్లేందుకు ఢిల్లీ, ముంబయి నగరాల నుంచి రైలు, విమాన సౌకర్యాలున్నాయి. ఉదయ్‌పూర్ విమానాశ్రయం "దబోక్". ఇది నగరానికి సమీపంలోని సిటీ సెంటర్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, అహ్మదాబాద్, ముంబయి, ఔరంగాబాద్‌లకు విమాన సేవలు నడుస్తున్నాయి.

అయితే ఉదయ్‌పూర్ అందాలను ఆస్వాదించాలంటే రైలు ప్రయాణమే అనుకూలంగా ఉంటుంది. చిత్తోర్‌ఘర్, కోట, అజ్మీర్, జైపూర్, ఢిల్లీలకు నేరుగా రైలు సేవలు ఉన్నాయి. అహ్మదాబాద్‌కు మీటర్ గేజి మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. రోడ్డు మార్గంలో అయితే.. ఆగ్రా 630 కి.మీ., అహ్మదాబాద్ 262 కి.మీ., జైపూర్ 406 కి.మీ., జోధ్‌పూర్ 275 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అత్యాధునిక వసతులు గల బస్సులను ఈ నగరాలకు నడుపుతోంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.