ఇక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, పాతలలోకం, పద్మవ్యూహం, పద్మద్వీపంలాంటి ఎన్నో కళాకండాలను మనం వీక్షించవచ్చు. బ్రహ్మలోకంలోకి ప్రవేశించగానే కమలంలో పుష్పాసనంలో కూర్చొని ఉన్న బ్రహ్మ, సరస్వతీదేవి యొక్క రూపాలు మనముందు సాక్షాత్కరిస్తాయి. తెల్లని మేఘాలతో, హంసలతో అత్యద్భుతంగా మలిచారు. ఎవరికైనా నిజంగా బ్రహ్మలోకాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది.
ఇక విష్ణులోకంని విషయానికి వస్తే శేషతల్పంపై పవళించిన విష్ణుమూర్తి, ఏడుద్వారాలతో నిజమైన విష్ణులోకాన్ని తలపిస్తుంది. ఇక్కడ భక్తులను ఆకట్టుకొనే మరో విశేషం 60 అడుగుల ఎత్తైన పంచముఖ హనుమాన్ విగ్రహం. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇవేకాకుండా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న కృష్ణ భగవానుడు. కురుక్షేత్ర యుద్ధానికి సమాయత్తమవుతున్న సైనిక పటాలం, విశ్వరూపధారుడైన విష్ణుమూర్తి, భాగవతంలోని ప్రధాన ఘట్టమైన గజేంద్రమోక్షం, ఇవన్నీ మాటల్లో వివరించాడానికి సాధ్యం కాదు తప్పకుండా కళ్లారా చూసి తీరాల్సినవే...!!
ఇప్పటికే వివిధ పాఠశాల యాజమాన్యాలు తమ విద్యార్థుల్లో పౌరాణిక విజ్ఞాన్ని పెంపొందించేందుకు తమ వైజ్ఞానిక యాత్రల్లో భాగంగా సురేంద్రపురిని సందర్శిస్తున్నారు. ఈ కళాక్షేత్రాన్ని సందర్శించడంవల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని... పైగా పురాణాల గురించి భోదించడం కన్నా చూపిస్తూ వివరించడం వల్ల పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నారని ఈ క్షేత్రాన్ని సందర్శించిన ఉపాధ్యాయులు ముక్తకంఠంతో చెబుతుండటం గమనార్హం.
ఎలా వెళ్లాలంటే... హైదరాబాద్-వరంగల్ రహాదారిపై నగరానికి సరిగ్గా 60 కి.మీ దూరంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మనందరికీ తెలిసిందే. ఈ దేవాలయానికి వెళ్లే దారిలో సురేంద్రపురి అనే గ్రామంలో నెలకొల్పబడిందే ఈ అద్భుత కళాక్షేత్రం. రోడ్డు మార్గం గుండా అయితే నగరం నుండి అరగంట ప్రయాణం. యాదగిరిగుట్ట బస్స్టేషన్ నుండి కేవలం ఒక కి.మీ దూరం మాత్రమే.
రైలు మార్గం ద్వారా వెళ్లే భక్తులు సికింద్రాబాద్-కాజీపేట మార్గంలోని రాయగిరి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడినుండి బస్సుమార్గం ద్వారా ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు రాయగిరిలో కేవలం ప్యాసింజర్ రెళ్లకు మాత్రమే హాల్టింగ్ ఉంది. ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా వచ్చే భక్తులు భువనగరి (9 కి.మీ) లేదా ఆలేర్ (11 కి.మీ) స్టేషన్లలోగాని దిగవలసి ఉంటుంది. ఇక దేశం నలుమూలనుండి వచ్చే భక్తులు రైలు మార్గం ద్వారాగానీ, విమానం ద్వారాగానీ కళాధామం చేరుకోవచ్చు. |