ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » సౌమ్యకే నాథుడు, ప్రశాంత స్వరూపుడు "సౌమ్యనాథుడు" (Religious, Narada Maharishi, Soumyanath, Cuddapah, Nandalore, Chola Kings, Annamayya,)
Feedback Print Bookmark and Share
 
Sowmyanath
FILE
నారద మహర్షిచే ప్రతిష్టించబడి.. సంతాన సౌమ్యనాథుడిగా, వీసాల సౌమ్యనాథుడిగా, కలియుగ దైవంగా విరాజిల్లుతున్న సౌమ్యనాథ స్వామి కడప జిల్లాలోని నందలూరులో వెలిశాడు. ఒక్కసారి దర్శిస్తేనే కలలో దర్శనమిచ్చే సౌమ్యనాథుడు.. కోరిక కోర్కెలు తీర్చే దైవంగా, ఇంటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు.

11వ శతాబ్దంలో చోళవంశ రాజులచేత నిర్మించబడ్డ సౌమ్యనాథ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విశేషంగా తరలివస్తుంటారు. ఆలయంలో ఎలాంటి వెలుతురూ లేకపోయినా, తన దేదీప్యమానమైన వెలుగుతో భక్తులను ఆకట్టుకునే స్వామివారు.. తన కరుణా కటాక్ష వీక్షణాలను వారిపై ప్రసరిస్తూ ఉంటారు.

ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పురాతన దేవాలయాల్లో ఒకటిగా వెలుగొందుతున్న సౌమ్యనాథ స్వామి ఆలయం.. నాటి శతాబ్దాల ఘన వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేస్తోంది. అభయ హస్తీశ్వరుడిగా భక్తులకు దర్శనమిచ్చే సౌమ్యనాథ ఆలయంలో.. శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూల విరాట్టుకు ఏ మాత్రం తీసిపోని విధంగా స్వామివారి మూలవిరాట్టు రూపుదిద్దుకుంది.
అన్నమయ్య గీతాలాపన..
ఆ రోజుల్లో అన్నమయ్య సౌమ్యనాథుడి ఆలయాన్ని దర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిపై శృంగార కీర్తనలు ఆలాపించి, రచించినట్లు పలు ఆధారాలున్నాయి. ఇక.. సౌమ్యనాథుడు అంటే సౌమ్యకే (లక్ష్మీదేవి) నాథుడనీ, ప్రశాంత స్వరూపుడనీ అర్థం...


ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళా శిల్ప నైపుణ్యానికి ప్రతీకగా సౌమ్యనాథ ఆలయం వెలసింది. 11వ శతాబ్దపు పూర్వార్థంలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యంను విరాళంగా ఇచ్చినట్లు ఆలయ శాసనాల్లో కనిపిస్తుంది. అప్పట్నించి చోళ, పాండ్య, కాకతీయ, మట్లి.. తదితర రాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టి అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది.

12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు సౌమ్యనాథుడి ఆలయానికి గాలి గోపురం కట్టించి.. నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్తవరం గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ మాన్యాలపై వచ్చే ఆదాయంతోనే ఆలయంలో నిత్య నైవేధ్యాలు జరుగుతుండేవి. అయితే బ్రిటీష్ పాలన తర్వాత దేవాలయాలకు శిస్తును నిలిపివేశారనీ, ఆ తరువాత మద్రాస్ గవర్నర్ లార్డ్ మన్రో శిస్తులివ్వటాన్ని పునరుద్ధరించాడనీ చరిత్ర చెబుతోంది.

పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక గ్రామం నందలూరుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి, ఆ గ్రామానికి మధ్యలో బాహుదా నది గతంల గలగలా పారుతూ ప్రవహిస్తుండేదని తెలుస్తోంది. ఆ రోజుల్లో అన్నమయ్య సౌమ్యనాథుడి ఆలయాన్ని దర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిపై శృంగార కీర్తనలు ఆలాపించి, రచించినట్లు పలు ఆధారాలున్నాయి.

16వ శతాబ్దంలో నందలూరుకు ఐదు మైళ్ల దూరంలో పొత్తపి రాజధానిగా వెలుగొందుతుండేదట. ఈ రాజధానిని పరిపాలించిన తిరు వెంగళనాథుని రాణి చెన్నమణి సౌమ్యనాథుడికి రత్నాల కిరీటం, శంఖు చక్రాలను సమర్పించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే జక్కల తిమ్మసాని రత్నాల పందిరం, జువ్వల కమ్మలు, ఇతర స్వర్ణాభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.