ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » నవబ్రహ్మలకు నిలయం.. దక్షిణ కాశీ క్షేత్రం "ఆలంపూర్" (Religious | Alampur | Srisailam | Tungabhadra River | Karnool | Mahaboobnagar | Ganga River | Kasi | Visweswara | Visalakshi | Jogulamba)
నవబ్రహ్మలకు నిలయం.. దక్షిణ కాశీ క్షేత్రం "ఆలంపూర్"
FILE
అరవైనాలుగు ఘట్టాలు, 18 తీర్థాలతో, అష్టాదశ శక్తి పీఠాలతో అలరారుతున్న "ఆలంపూర్" దక్షిణ కాశిగా కొనియాడబడుతోంది. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా భాసిల్లుతున్న ఆలంపూర్ తుంగభద్రానది తీరంలో ఉండే కర్నూలుకు 15 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. దక్షిణ భారత దేశంలోని అనేక క్షేత్రాలలో ఆలంపూర్ను మాత్రమే కాశీ క్షేత్రంతో పోలుస్తూ దక్షిణ కాశిగా పిలుస్తుంటారు.
కాశీ క్షేత్రంలో గంగానది ఉంటే, ఆలంపూర్లో తుంగభద్రా నది ఉంది. కాశీలో విశ్వేశ్వర, విశాలాక్షులు ఉంటే, ఆలంపూర్లో బాలబ్రహ్మేశ్వర, జోగులాంబలు కొలువైయున్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా-యమునల సంగమం జరిగితే.. ఆలంపూర్లో తుంగభద్ర-కృష్ణా నదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ-అసి అనే నదులు సంగమిస్తే.. ఆలంపూర్లో వేద-నాగవతి నదులు కలుస్తాయి. కాశిలో ఉన్నట్లే 64 ఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఆలంపూర్లో కూడా ఉన్నాయి కాబట్టే దీనిని "దక్షిణ కాశి"గా అభివర్ణిస్తుంటారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివారి దివ్యక్షేత్రమైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడే ఆలంపూర్ గురించి ఎన్నో రకాల స్థల పురాణాలున్నాయి. పూర్వం ఆలంపూర్ క్షేత్రాన్ని "హతంపుర" అని పిలిచేవారట. అదే కాలక్రమంలో అల్లంపురగా, ప్రస్తుతం పిలువబడే ఆలంపూర్గా రూపాంతరం చెందినట్లు చెబుతుంటారు. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ఆలంపూర్ "నవబ్రహ్మ" ఆలయాలకు ప్రసిద్ధి.
ఈ ఆలయాల నిర్మాణం చాళుక్య రాజైన రెండవ పులకేశి పరిపాలనా కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాలపాటు సాగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఎత్తైన విమానం, గర్భాలయ ప్రవేశ ద్వారబంధాలకు చిత్రాలంకార శిల్పాలు, ద్వారపాలకులుగా గంగాయమునల విగ్రహాలుంటాయి. అంతేగాకుండా గుడి పై భాగంలో ఉసిరికాయ ఆకృతిని పోలిన శిలను ఉంచి, దానిపై శిఖరాన్ని ఏర్పర్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఆలయ సముదాయంలోని ప్రధానమూర్తులను బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మలుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇవన్నీ శివలింగాలే కావటం గమనార్హం. అయితే ఈ శివలింగాలను బ్రహ్మ పేరుతో ఎందుకు పిలుస్తారో తెలిపే ఆధారాలు మాత్రం అందుబాటులో లేవు.
అయితే బాలబ్రహ్మదేవుడు తపస్సుచేసి లింగాన్ని ప్రతిష్టించినందున బ్రహ్మేశ్వరుడని పేరొచ్చినట్లుగా చెబుతుంటారు. నిత్య పూజలు జరిగేదీ కూడా ఈ ఆలయంలోనే. మూలవిరాట్ అయిన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగము. భక్తులు ఎంతనీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు.