పవిత్ర నదీ జలాలు, సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శించిన సతీ అనసూయ ఆశ్రమం, రామ్ఘాట్, భూ అంతర్భాగంలో ప్రవహించే గుప్త గోదావరీ నదీమతల్లి, హనుమాన్ ధార, జానకీ కుండ్లాంటి పవిత్ర స్థలాలను సందర్శించాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ పరిసర ప్రాంతాలకు చేరుకోవాల్సిందే. ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక విశేషాలెన్నో కలిగిన ఈ ప్రాంతాలు పర్యాటకులకు మరపురాని అనుభూతులను అందిస్తాయి. అవేంటో చూద్దామా..?!
ముందుగా చెప్పుకోవాల్సింది సతీ అనసూయ ఆశ్రమం. చిత్రకూట్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలోగల మందాకినీ నది ఎగువభాగంలో ఈ సతీ అనసూయ ఆశ్రమం కలదు. ఈ ప్రాంతం దట్టమైన అడవుల సమాహారంతో ఉంటుంది. అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ, వారి ముగ్గురు కుమారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ఆశ్రమంలో నివసించినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా సందర్శించినట్లు చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. చుట్టుప్రక్కల కొండల్లోంచి ప్రవహించే చిన్న చిన్న జలపాతాలన్నీ కలిసి ఏర్పడిన మందాకినీ నది ఈ ఆశ్రమం పక్కనుంచే ప్రవహిస్తూ కనువిందు చేస్తుంటుంది. ఇక్కడ పక్షుల కిలకిలారావాలను పరవశించి వినవచ్చు.
చిత్రకూట్లో మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలం రామ్ఘాట్. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పూజలు చేస్తుంటారు. మందాకినీ నదిలో బోట్ ప్రయాణం చేయడం ఓ గొప్ప అనుభూతి. బోట్లో ప్రయాణిస్తూ నదీ తీరాన్ని చూస్తుంటే ఆనందంతో పెద్దగా కేకలు వేయాలనిపిస్తుంది.