అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు... ఇంకా ఉన్నాయ్!!
FILE
అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్ శాంక్చురీలో సుమారుగా 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 పొడవైన నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుత పులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు.. తదితరాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.
కేవలం వన్యమృగాలకు నిలయం మాత్రమే కాకుండా.. ఇక్కడి అడవిలో రకరకాల సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, మిరియాలు, పచ్చిపోకలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కలతో కూడిన చెట్లు పెరుగుతుంటాయి. అలాగే రకరకాల మూలికలతో సిద్ధంగా ఉండే ఆయుర్వేద మందులషాపులు కూడా ఇక్కడ అడుగడుగునా కనిపిస్తాయి. ఇక ఆయుర్వేద మసాజ్ సెంటర్లయితే చెప్పనవసరం లేదు.
పెరియార్ వైల్డ్లైఫ్ శాంక్చురీకి ఎలా చేరుకోవాలంటే..?
విమానంలో వెళ్లేవారయితే.. మధురై నుంచి 140, కొచ్చి నుంచి 190, తిరువనంతపురం నుంచి 190, కోజికోడ్ నుంచి 135, చెన్నై నుంచి 570 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక రైలు మార్గంలో అయితే శాంక్చురీకి దగ్గర్లో ఉండే రైల్వేస్టేషన్లు : చెన్నై నుంచి 60, చెంగనస్సరో నుంచి 114, మధురై నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అదే రోడ్డు మార్గంలో అయితే తేక్కడికి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమిలీ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
ఇక వసతి విషయానికి వస్తే... పెరియార్ సాంక్చురీలో అడవి మధ్యలో నిర్మించిన కాటేజీలలో విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే.. గాలికి రాలుతున్న ఆకుల చప్పుడు, పువ్వుల పలుకరింపులు, అద్భుతమైన సుగంధ ద్రవ్యాల సువాసలకు మైరచిపోతామంటే అతిశయోక్తి కాదు. అందుకనే ప్రకృతి ప్రేమికులు, చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన రమ్యమైన ప్రాంతం "పెరియార్ వన్యమృగ సంరక్షణా కేంద్ర"మని చెప్పవచ్చు.