రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలైనా.. తెలంగాణ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, నక్సలిజం, కాపులకు రిజర్వేషన్లు వంటి కీలకమైన, నిర్దిష్టమైన అంశాలపై ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి తన విధానాలను ప్రకటించలేదు. ఈ విషయాలపై నిర్ణయం తానొక్కడినే తీసుకోలేనని, ఇది మేధావులు, సామాజిక నేతలు, రాజకీయ పార్టీల నేతలు కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మేధోమథనం జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
నలుగురి చంపడం వల్ల సమాజం సంపూర్ణంగా మారదని, నక్సలిజాన్ని సామాజిక సమస్యగా పరిగణిస్తానని ఆయన అన్నారు. తాను ప్రకటించే విధానాలు సంపూర్ణం కాకపోయినా తన అభిప్రాయాలను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా.. మహాకవి శ్రీశ్రీ రాసిన కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం.. సమస్త వృత్తుల సమస్త చిహ్నాలు అనే కవితను చదివి బడుగు బలహీనవర్గాల పక్షాన తన పార్టీ ఉంటుందని చెప్పారు.
రైతుల దుస్థితి గురించి వివరించి వారి మేలు కోసం తమ పార్టీ కృషి చేస్తానని ఆయన చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో లోపాల గురించి ప్రస్తావించారు. విద్యారంగానికి, మధ్య తరగతికి తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పేదలు కిలో రెండు రూపాయలు పొందలేరు.. 25 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనలేరు అంటూ.. ఆయన పేదల జీవనశైలిని స్పృశించారు. వీరి బాగుకోసం పని చేస్తామని ఆయన అన్నారు.
మహిళా సాధికారితకు తమ పార్టీ పెద్ద పీట వేస్తామని చెప్పారు. యువశక్తి సామర్థ్యాన్ని వాడుకుంటామని ఆయన చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాల గురించి ఆయన వివరిస్తూ వారికి తమ పార్టీ చేసే మేలును ఆయన చెబుతుపోయారు. సమసమాజ స్థాపనే తమధ్యేయమని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. పట్టణాలకు, గ్రామాలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని ఆయన విమర్శించారు. బాలకార్మికుల వ్యవస్థను నిర్మూలిద్దామన్నారు.
ప్రభుత్వం ప్రజలకు కనీస సౌకర్యాలు బాధ్యత అని, అవి పొందడం ప్రజల హక్కుగా ఆయన పేర్కొన్నారు. ఆకలి, అవసరాలు, అత్యాశ ఈ మూడు అవినీతికి మూలాలన్నారు. అత్యాశ చాలా ప్రమాదకరమని, జాతికే అరిష్టమని ఆయన అన్నారు. ప్రాజెక్టులను స్వాగతిస్తామని, అయితే అవినీతి కోసం చేపట్టే పథకాలను వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. మద్యం మత్తు కుటుంబాలను చిత్తు చేస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
|