ప్రజాధనాన్ని దోచుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం వైఎస్.రాజశేఖర రెడ్డి "ఇద్దరూ ఇద్దరే"నని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటారే గానీ, చేసిన అవినీతి కుంభకోణాలను వెలికి తీసేందుకు ఎవరూ సాహసం చేయరన్నారు. తన గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా చిరంజీవి వివిధ ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్ సర్కారుల పనితీరుపై విమర్శలు తీవ్ర స్థాయిలో సంధించారు. అసెంబ్లీలోనూ, బయటా ఒకరిపై ఒకరు నువ్వు అవినీతిపరుడువంటే నువ్వు అవినీతిపరుడవని తిట్టుకుంటారేగానీ.. ఏదీ బయట పెట్టుకోరన్నారు. లోలోపల మాత్రం తాము చేసిన లొసుగులు బయటకు రాకుండా ఇద్దరూ జాగ్రత్త పడతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతికి కిటికీలు తెరిస్తే, ప్రస్తుత వైఎస్ సర్కారు ఏకంగా ద్వారాలే తెరిచి ప్రజాధనాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే వారిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటారన్నారు. అవినీతిలో వైఎస్, చంద్రబాబు దొందూ దొందేనని చిరంజీవి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వీరి అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. |