బీజేపీతో రాష్ట్ర స్థాయిలో సంబంధాలు తెంచుకున్నప్పటికీ, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో తాము ఇప్పటికీ భాగస్వాములమేనని బిజూ జనతాదళ్ (బీజేడీ) ఉద్ఘాటించింది. జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుంటే, తాము ఎన్డీఏలోనే ఉన్నామని బీజేడీ ప్రధాన కార్యదర్శి దమోదర్ రౌత్ తెలిపారు.
ప్రస్తుతానికి తాము ఎన్డీఏలోనే ఉన్నాము. అందువలన జాతీయ రాజకీయాల్లో బీజేడీ పాత్ర గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని చెప్పారు. ఎన్నికల పూర్తయితే, మిగిలిన విషయాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు. ఇదిలా ఉంటే బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కూడా లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని తృతీయ కూటమిలో చేరడంపై మౌనం వహించారు.
బీజేపీ, కాంగ్రెస్యేతర కూటమిలోకి అధికారికంగా ఆహ్వానించేందుకు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ భువనేశ్వర్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తృతీయ కూటమిలో చేరే విషయంపై ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకుంటామని సీతారాం ఏచూరీతో సమావేశం అనంతరం పట్నాయక్ విలేకరులతో చెప్పారు. |