ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజా విజయభేరి సభలో సినీ నటుడు నాగేందర్ బాబు అశేష ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వాలు గద్దెదిగక తప్పదని, ప్రజల బాగోగులు చూసే ప్రజారాజ్యం పార్టీకి మద్దతు తెలపాలని నాగబాబు కోరారు.
ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా తాను రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు వెళ్ళినప్పు డు తనకు ఓ విషయం స్పష్టంగా అర్థమైందని నాగబాబు అన్నారు. ప్రజలెవరూ సెజ్లు, పరిశ్రమలు కోరుకోవడం లేదని తిండి, కట్టుకునేందుకు బట్ట, జీవించేందుకు జానెడు చోటు కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు ఆ కనీస అవసరాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
కృష్ణా-గోదావరి వంటి జీవనదులు ప్రవహిస్తున్నా... రాష్టంలో 2.5 కోట్ల మంది ఇంకా ఒంటి పూటే భోజనం చేస్తూ ఉంటే ఇప్పటివరకూ పాలించిన ప్రభుత్వాలు ఏం చేశాయని నాగబాబు ప్రశ్నించారు. అలాగే విద్య, వైద్యం, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మాటే లేదని వాపోయారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడమే ప్రజారాజ్యం లక్ష్యమని స్పష్టం చేశారు. |