విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ స్థానం నుంచి తన బావమరిది, పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ పోటీలో నిలబడుతున్నారని చిరంజీవి ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మరో ముంబైగా మారనుందని, అందువల్లే బడాబాబుల కన్ను ఈ ప్రాంతంపై పడిందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వస్తే తన తొలి సంతకం 'వంద రూపాయలకే వంట సరుకు' పథకం ఫైలుపై చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.
టిక్కెట్ల కేటాయింపులో తమ పార్టీ సమన్యాయం పాటిస్తున్నట్లు ఆయన వివరించారు. పీఆర్పీ రెండో జాబితాలో మహిళలకు మరింతగా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా అంకిత యాత్ర రోడ్ షోలలో పాల్గొంటున్న చిరంజీవి శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి మూడో రోజు శనివారం పర్యటనలో భాగంగా కాకినాడలో ప్రసంగించారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటు విషయాన్ని పున:పరిశీలిస్తామని చిరంజీవి వెల్లడించారు. టిక్కెట్లు కేటాయింపుల సమయంలో ఏ పార్టీలోనై అసంతృప్తులు చోటుచేసుకోవడం సహజమేనని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలను సామరస్యంగానే అంతర్గతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
సాధారణంగా సీటు ఆశించి, దక్కకపోవడంతో కొందరు అసంతృప్తికి లోనవుతుంటారన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది టిక్కెట్ ఆశించినా, వారిలో ఎవరో ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం సహజమన్నారు. అయితే, టిక్కెట్ దక్కని వారు ఆందోళనలకు దిగకుండా సంయమనంతో వ్యవహరించాలని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. |