తొలి దశ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రజారాజ్యం పార్టీకి వచ్చే నేతల వలసలు మాత్రం ఆగలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో టిక్కెట్లు దక్కని సీనియర్ నేతలు ప్రజారాజ్యంలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా, భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షుడు చిరంజీవి సమక్షంలో పీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు.
భీమవరం నుంచి పోటీ చేసేందుకు శ్రీనివాస్కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన మనస్తాపం చెందారు. దీంతో సొంత పార్టీ సభ్యత్వంతో సహా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పాలకొల్లులో పర్యటించిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సమక్షంలో పీఆర్పీలో చేరారు. కాగా, గ్రంధి శ్రీనివాస్కు భీమవరం టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.