అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకు 104 సీట్లు కేటాయించి సామాజిక న్యాయంలో ప్రజారాజ్యం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ సీట్లు అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, టిక్కెట్ లభించని ఆశావహులు, ప్రత్యర్థులు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చిరంజీవి అన్నారు.
అభిమానుల రాజీనామాపై మాట్లాడుతూ ఇన్నాళ్లు తన వెంట ఉన్నవాళ్లు ఇలా చేయడం మనుస్సుకు కష్టం కల్గించిందని, రాజకీయాలంటే ఎంతటి దగ్గరి వారినైనా దూరం చేస్తాయనే నానుడి నిజమైందన్నారు. పవన్ కల్యాణ్కు పదవులపై ఆశలు లేవన్నారు. పార్టీకి రాజీనామా చేసిన అంజనేయరెడ్డి ఎంతో నిజాయితీ కల్గిన వ్యక్తి అని ఆయనకు క్షమాపణ చెప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తానని ఒక ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇచ్చారు.