ప్రజారాజ్యం పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆ పార్టీ మాజీ నేత పరకాల ప్రభాకర్ వెనుక రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ హస్తం ఉందని పీఆర్పీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఆధారాలతో సహా వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. తమ పార్టీని భ్రష్టు పట్టించేందుకు పరకాలను అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులు చేస్తున్న కుట్ర అని అల్లు అరవింద్ ఆరోపించారు.
ఎవరు చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారనేది త్వరలోనే మీడియాకు చెబుతానని అల్లు తెలిపారు. అంతేకాకుండా, తమ పార్టీ ఏనుగు లాంటిదన్నారు. వీధిలో ఏనుగులు వెళుతుంటే ఏవేవో మొరుగుతుంటాయని, అలాంటిదే ఇది కూడా అని అల్లు అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీలోకి కోవర్టుగానే వచ్చారని ఆ పార్టీనేత హరిరామ జోగయ్య ధ్వజమెత్తారు.
అలాంటి కోవర్టులు పార్టీని వీడటమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో కోట్లు దండుకున్నారని జోగయ్య ఆరోపించారు. ఇప్పుడు కూడా ఏదో పార్టీ నుంచి డబ్బులకు అమ్ముడు పోయి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.