ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల చిహ్నం గుబులు సోమవారంతో తీరిపోయింది. ఆ పార్టీకి రైలింజన్ గుర్తును కేటాయించడం సబబేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. రాష్ట్రీయ క్రాంతి కారి సమాజ్వాది పార్టీ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసింది. ప్రజారాజ్యానికి రైలింజన్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తు రాష్ట్రీయ క్రాంతికారి సమాజ్వాది పార్టీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
గతంలో తాను రైలింజన్ గుర్తుపై పోటీ చేశామని, అందువల్ల ఈ దఫా కూడా ఆ గుర్తునే తమకు కేటాయించాలని ఆ పార్టీ తన పిటీషన్లో పేర్కొంది. దీనిపై రెండు దఫాలుగా వాదోపవాదనలు విన్న సుప్రీం సోమవారం తుది తీర్పు ఇచ్చింది.
క్రాంతికారి పార్టీ సవాల్ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తు కేటాయింపు సబబేనని గతంలో ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకుంది. ఈ గుర్తుపై ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరాలుండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.