తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ హయాంలో కొడుకు వద్దకు పాలన పేరుతో సాగుతోందని ఆ పార్టీ నేత, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. కృష్ణాజిల్లా ఎన్నికల ప్రచారంలో సోమవారం గుడివాడలో ఆయన ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం మేలు చేసిందని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి ప్రజావైద్యంపై ఆసక్తిలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వైద్యసదుపాయాలు లేక దాదాపు ఆరు వేల మంది విషజ్వరాలతో మృతి చెందారని ఆయన అన్నారు. జలయజ్ఞంలో అవినీతి ఏరులైపారిందన్నారు. అవినీతి కాంగ్రెస్ను గద్దెదించి తెదేపాను గెలిపించాలని ప్రజలను బాలయ్య కోరారు.
ప్రజా సంక్షేమం కోసం తెదేపా కృషి చేస్తోందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెదేపా అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. అందువల్ల తెదేపాకు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.