దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే వివిధ ఛానెళ్ళు సర్వేలు నిర్వహించాయి. వీటిలో భాగంగా చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ ఛానెళ్ళు చేసిన సర్వేలను ప్రసారం చేసాయి. ఇందులో భాగంగా ఎన్డీటీవీకూడా సర్వే నిర్వహంచింది. ఆ టీవీ నిర్వహించిన సర్వేననుసరించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని, అదే బీహార్ రాష్ట్రంలో ఎన్డీయేకూటమి ఆధిక్యంలో ఉంటుందని తెలిపింది.
ఈ సర్వేలో దాదాపు 77 వేలమంది అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 లోక్సభ సీట్లుండగా అందులో ఎన్డీయేకూటమికి దాదాపు 33 లోక్సభ సీట్లు రానున్నాయని సర్వే తెలిపినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. ఇక్కడ యూపీఏ కూటమికి కేవలం ఒక్క సీటుమాత్రమే వస్తుందని తెలిపింది. కాగా మూడవ కూటమికి ఏ సీటూ దక్కదని, లాలూ, పాశ్వాన్లకు చెందిన నాల్గవ కూటమికి 5సీట్లు వస్తాయని తెలిపింది.
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 26 లోక్సభ సీట్లుండగా ఇందులో ఎన్డీయేకూటమికి దాదాపు 18 సీట్లు, యూపీఏకూటమికి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
కర్నాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలుండగా అందులో ఎన్డీయేకూటమికి 17 స్థానాలు, యూపీఏ కూటమికి 9 స్థానాలు, మరో రెండు స్థానాలు మూడవ ఫ్రంట్కు వెళ్ళే సూచనలున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 42 లోక్సభ స్థానాలుండగా అందులో ఎన్డీయేకూటమికి రెండు, యూపీఏ కూటమికి 29, మూడవ ఫ్రంట్కు 10, నాల్గవ ఫ్రంట్కు ఒక్క సీటు దక్కే సూచనలు కనపడుతున్నాయని పేర్కొంది.
ఇదిలావుండగా తమిళనాడు రాష్ట్రంలోని ఫలితాలు ఢిల్లీ పీఠంపై ప్రభావం చూపనుంది. ఇక్కడ ఎన్డీయే ఖాతా తెరిచే అవకాశమే కనపడటం లేదని సర్వేలు చెబుతున్నాయి. యూపీఏ కూటమికి దాదాపు 20 స్థానాలు, మూడవ కూటమికి 18 స్థానాలు, ఇతరులకు ఒక్క స్థానం దక్కే సూచనలు కనపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.