అయితే పాత పార్టీలతో విసుగెత్తిన ఓటరు దేవుడు కొత్త పార్టీ ఎదురైతే తప్పక పట్టం కడుతాడనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయని కొందరి వాదన. అందుకు ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన ఉదంతాన్ని వాళ్లు ఎత్తి చూపుతున్నారు. అలా చూస్తే అదీ నిజమే అనిపిస్తుంది. 1982 మార్చి 21న మీడియా ప్రతినిధుల ముందు పార్టీ గురించి ప్రకటన చేసి దాదాపు పది నెలల కాలంలో... అంటే 1983 జనవరి 5వ తేదిన జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్రను తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
అయితే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు వేరు. ఆయన నినాదాలకు ఆనాడు ప్రజలు ఆకర్షితులయ్యారు. కిలో రూ.2 బియ్యం పథకం వంటి అనేక ప్రజా ప్రయోజన అంశాలతో ఆయన ఆనాడు ప్రజల ముందుకొచ్చారు. అందుకే ఆనాడు ప్రజలు ఎన్టీఆర్కు అధికార పగ్గాలు అందించారు.
ఇక ప్రస్తుత రోజుల్లో ప్రజలు అన్నింటినీ విశ్లేషించి నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదిగారు. చెప్పాలంటే... ఓటు వేసే సమయంలో కేవలం పార్టీని కాకుండా అభ్యర్థి గుణగణాలను బేరీజు వేసి ఆపై ఓటు వేస్తున్నారు. అందుకే ఫలానా ప్రాంతంలో తమ పార్టీ పటిష్టంగా ఉంది అని ఏ పార్టీ కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నేడు చోటు చేసుకుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ స్థాపించి కొద్ది రోజుల్లోనే చిరంజీవి అధికారంలోకి రాగలిగితే నిజంగా అది చరిత్ర అవుతుంది. అయితే చిరంజీవి చరిత్ర సృష్టిస్తారా... లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం చిరు పార్టీ ప్రకటన కోసం కొన్ని నెలలు వేచి చూచిన విధంగానే ఫలితం కోసం మరి కొన్ని నెలలు వేచి చూడక తప్పదు.
|