రాష్ట్రంలో రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా రంజుగా మారాయి. అధికారం మాటెలా ఉన్నా పార్టీల మనుగడ కోసం నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టి దాదాపు 17 సంవత్సరాలకు పైగా రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపుకాదు. 2004 ఎన్నికల ఘోర పరాభవంతో క్రమంగా ఛరిష్మా కలిగిన ఆ పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని కట్టబెట్టేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కష్టాలు పడుతున్నారు.
మరోవైపు.. జలయజ్ఞంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అవినీతి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్నే కలిగించాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, చిరంజీవి పార్టీల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ పార్టీలను ప్రధాన కేంద్రాలుగా చేసుకునే కూటములు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
చిన్నా చితక పార్టీలు తమ చక్రాన్ని తిప్పనున్నాయి. తెదేపా ఆవిర్భావం తర్వాత అనేక పార్టీలు పుట్టుకొచ్చినా.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, తెదేపాల మధ్యే ఉంది. 1999 ఎన్నికలు మినహా మిగిలిన ఎన్నికల్లో వామపక్షాలు పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఇక భారతీయ జనతా పార్టీ తనదారిలో తాను పయనిస్తోంది.
రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సంస్థాగత బలం ఉన్న పార్టీల జాబితాలో తెదేపా, కాంగ్రెస్, తెరాస, బీఎస్పీ, వామపక్షాలు, ఎన్టీపీలు ఉన్నాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో తెదేపా వామపక్షాలు, బీఎస్పీలు కలిసే అవకాశం ఉంది. చిరంజీవి పార్టీ తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేస్తే తెరాస, ఎన్టీపీలు చిరు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో చిరంజీవి పార్టీ భాజపా, ఎన్టీపీలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది.
అపుడు కాంగ్రెస్ ఏకాకి అవుతుంది. అయితే.. చిరంజీవి పార్టీ విధి విధానాల వెల్లడి అనంతరం రాష్ట్ర రాజకీయసమీకరణాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో తెదేపా, కాంగ్రెస్, చిరంజీవి పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడనుంది. ఈ పోటీలో ఎవరు "విజేత"లో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
|