సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆయన రూపకల్పన చేస్తున్న ప్రణాళిక ఎలా ఉంటుందన్నఆలక్తి నెలకొంది. అలాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. తనకు స్ఫూర్తి అని చెబుతున్న ఈ నవ రాజకీయవేత్త రానున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఎటువంటి పద్ధతులు అనుసరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చిరు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో రైతన్నలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాల కంటే... ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను ఆదుకునేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టింది. అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వరికి గిట్టుబాటు ధర... రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటివాటిని రాష్ట్ర ప్రజలకు అందించడంలో సఫలీకృతులయినట్లు చెప్పవచ్చు. ఇదిలా ఉంటే... ఎన్నికలు సమీపిస్తుడటంతో.. అధికార పార్టీ రాష్ట్రంలోని అధికులను తమవైపు ఆకర్షించేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం కూడా సహజమే.
ఈ తరుణంలో ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీ ప్రణాళికల పట్ల అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు ఓ కన్నేసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల సందడి ఓ వైపు... రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల నుంచి సాగుతున్న రాజకీయ వలసలు మరోవైపు ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేస్తున్నాయి. ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతున్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలను మించి, రైతులను ఆకర్షించేందుకు తన ప్రణాళిక రచన చేయడంపై దృష్టిపెట్టింది.
|