మెగాస్టార్ చేపట్టిన ప్రకాశం జిల్లా జన ప్రభంజనాన్ని తలపించింది. ఎటు చూసినా జనమేజనం. రోడ్లుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి తమ అభిమాన హీరోకు హారతులతో స్వాగతం పలికారు. స్తబ్ధత నెలకొన్న పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మెగా పర్యటన ఇచ్చిన సక్సెస్తో పార్టీ నేతల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. జిల్లాలో మూడు రోజుల పాటు సాగిన చిరంజీవి పర్యటనకు అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. చిరు ప్రసంగం వినేందుకు గంటల తరబడి వేసి ఉన్నారు. జిల్లా యాత్ర శింగరాయకొండ నుంచి ప్రారంభమై పర్చూరులో ముగిసింది. ప్రారంభయాత్ర కాస్త మందకొండిగా సాగినప్పటికీ.. ఆ తర్వాత వేలాది మంది ప్రజలతో కిటకిటలాడింది. పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన చిరు.. యాత్ర విజయవంతం కావడంతో ఉబ్బితబ్బిబ్బులయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు హైకోర్టు రోడ్ షోలపై నిషేధం ఎత్తివేయడంతో ప్రజారాజ్యం పార్టీ శ్రేణుల్లో ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి. కనిగిరి సభలో ఇసుకేస్తే రాలనంత జనం. గిద్దలూరులో వర్షం పడుతున్నా.. రోడ్లపై నుంచి కదలకుండా చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు. గిద్దలూరు నుండి యరగ్రొండపాలెంకు సాగిన యాత్రాలోనూ ఇదే పరిస్థితి. యర్రగొండపాలెంలో లోగడ జరిగిన సభల కంటే.. చిరంజీవి సభ జరిగి, హైలెట్గా నిలిచింది. నిర్ణీత సమయానికంటే ఆలస్యంగా జరిగిన మార్కాపురం సభ కూడా సక్సెస్ అయింది. ఇది పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహనిచ్చింది. తర్వాత పొదిలి నుండి దర్శి సభల్లోనూ ఇదే పరిస్థితి. దారిపొడవునా జనం బంతిపూల వర్షంతో చిరుకు స్వాగతం పలికారు. దర్శి సభలో ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు, ముస్లిం వర్గాల మహిళలు కూడా హాజరుకావడం విశేషం. కాగా, దర్శి సభ స్థానికంగా కనీవిని ఎరుగనిస్థాయిలో జరిగింది. దర్శి సభానంతరం ముండ్లమూరు మీదుగా అద్దంకి వరకు సాగిన చిరంజీవి పర్యటన రాజకీయవర్గాలకు విస్మయం కలిగించింది. ఈ మార్గంలో వేలాది సంఖ్యలో హాజరైన ప్రజలు చిరంజీవికి నీరాజనం పలికారు. అద్దంకిలోనూ చిరంజీవి షో మెగా హిట్ అయ్యింది. సభ విజయవంతంపై అనుమానం వ్యక్తం చేసిన పీఆర్పీ నేతలు సభానంతరం హర్షాతిరేకం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రం ఒంగోలు సభ ప్రధాన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విధంగా సాగింది. ఒంగోలు ప్రజానీకం అడుగడుగునా చిరుకు స్వాగతం పలికింది. చిరంజీవి జిల్లాకు చెందిన వాడనే భావంతో జనం నీరాజనాలు పట్టారు. మినీస్టేడియంలో నిర్వహించిన సభ వినూత్నంగా సాగింది. జిల్లాతో తనకున్న అనుబంధం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు చిరంజీవి ప్రసంగం సాగడం ఈ పర్యటనకే హైలెట్. చిరంజీవి పర్యటన అనూహ్యరీతిలో విజయవతం కావడంతో ఒంగోలు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. |