ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రజారాజ్యం పార్టీ ఒక్కో ప్రజాకర్షక అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన రూ.వందకే వంట సరుకు, సంక్రాంతి సందర్భంగా బీసీ చేతివృత్తులకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రాంతాలకు సగం ధరకే విద్యుత్ హామీలు ప్రత్యర్ధి పార్టీల్లో చర్చనీ యాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న తరుణంలో చిరంజీవి ప్రకటించిన రెండు పథకాలతో ఖంగుతింది. అలాగే.. అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు కంట్లో నలుసుగా మారుతోంది. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇచ్చిన ప్రధానమైన మూడు హామీల అమలు విషయాన్ని పక్కనపెడితే, ఎన్నికల్లో తాయిలాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో నాలుగున్నరేళ్ల క్రితమే అనుభవపూర్వకంగా తెలుసుకున్న కాంగ్రెస్, తెదేపాలకు ఈ పరిణామం మింగుడుపడడంలేదు. గత ఎన్నికల ముందు ఉచిత విద్యుత్ నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వైనాన్ని విశ్లేషిస్తే, చిరంజీవి ఇచ్చిన మూడు ప్రధాన హామీలు ఎన్నికల్లో విజయా వకాశాలను మలుపు తిప్పే బ్రహ్మస్త్రాలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం జనభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ ప్రాంతాల్లోనే యువత, మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరిని ఆకట్టుకునేందుకు గాను చిరంజీవి తన అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉండటంతో పీఆర్పీ అప్పటి వరకు ప్రజాయాత్రలు నిర్వహిస్తుందని అందరూ భావించారు. అయితే రాజకీయ పార్టీలు అనుకున్న దానికి భిన్నంగా ప్రజాకర్షక పథకాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ అటు ఓటర్లను ఆకర్షిస్తూనే మరోవైపు తన పార్టీకి మరింత ప్రచారాన్ని కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసినప్పటికీ.. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను మాత్రం కట్టడి చేయలేక పోయింది. ఈ అంశం అధికార పార్టీకి ఏమాత్రం మింగుడు పడని అంశంకాగా, వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రకటించిన రూ.వందకే వంట సరకు సామాన్య, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఎంతగానో ఆకర్షించింది. రాష్ట్రంలో ఉన్న ఒక కోటీ 90 లక్షల మంది తెల్లకార్డు లబ్దిదారులందరినీ ఈ పథకంతో తమవైపుకు తిప్పుకునేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని పీఆర్పీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా ప్రకటించిన గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ సగం ధరకే విద్యుత్, చేతి వృత్తులపై ఆధారపడి జీవించే బీసీ కులాలకు ఉచిత విద్యుత్ హామీ మొత్తంగా ప్రధాన పార్టీలను దెబ్బతీసే పథకంగా ప్రచారమవుతోంది. వాస్తవానికి చిరంజీవి సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన హామీల్లో బీసీ కులవృత్తులకు ఉచిత విద్యుత్ పూర్తిస్థాయిలో కొత్తది కాకుండా పాక్షికమైప్పటికీ, పవర్లూమ్స్కు ఉచిత విద్యుత్ మాత్రం కొత్తదే. దీనివల్ల చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కాంగ్రెస్, తెదేపా ఓట్లకు గండిపడే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సగం ధరకే విద్యుత్ హామీపై గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ను కొనసాగిస్తూనే సగం ధరకే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ను సరఫరా చేస్తామని ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న చంద్రబాబు, వైఎస్లకు రాని సరికొత్త ఆలోచనగా దీన్ని పేర్కొంటున్నారు. |