మహాకూటమి ఏర్పాటుతో విపక్షాలు సంతోష పడిన మాట వాస్తవం. అధికారంలోకి వస్తామన్న ధీమా, ఆత్మస్థైర్యం వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే సీట్లు ఆశిస్తున్న నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ తేలినప్పటికీ.. తమకు సీటు దక్కుతుందో లేదో అన్నదే వారికి గుబులు. కూటమి వల్ల టిక్కెట్ కేటాయించలేని నేతలను ఎలా బుజ్జగించాలన్న దానిపై పార్టీ అధినేతలూ తర్జనభర్జనలు పడుతున్నారు. సీట్లు దక్కని వారికి ప్రస్తుతం ప్రత్యామ్నాయాలు చాలా ఉండటంతో ఎంపిక ప్రక్రియపై ఆచితూచి దృష్టి సారించవలసిన అవసరం నెలకొంది. 2004లో కేవలం మూడు పార్టీలే ఉండగా ఇప్పుడు ప్రజారాజ్యం, నవతెలంగాణ, లోక్సత్తా వంటి రాష్ట్ర స్థాయి పార్టీలతో పాటు బీఎస్పీ వంటి జాతీయ పార్టీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో టిక్కెట్ దక్కని నేతలు తమకు నచ్చిన పార్టీ తీర్థాన్ని పుచ్చుకునే వీలుంది. ఇదిలావుండగా మహాకూటమిలోని సీపీఐ, సీపీఎం పార్టీలకు పోగా.. మిగిలిన అసెంబ్లీ స్థానాలు 50-50 చొప్పున పంచుకునేందుకు తెదేపా, తెరాస ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే.. ఈ రెండు పార్టీల మధ్యే అసలు సమస్య ఏర్పడనుంది. తెదేపాకు మంచి పట్టున్న స్థానాలపై తెరాస నేతలు కన్నేశారు. ప్రస్తుతం తమ వద్ద స్థానాలతో సహా.. మరికొన్ని తేదేపా సీట్లపై తెరాస నేతలు పట్టుబడుతుండటంతో సమస్య జఠిలంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఇరు పార్టీల్లో అంతర్గతంగా కుమ్ములాటలు, తిరుగుబాట్లు తప్పేలా కనిపించడం లేదు. ఇరు పార్టీలకు చెందిన అగ్ర నేతలు, మాజీలు, మాజీ మంత్రులు ఒకే నియోజకవర్గాలు ఆశిస్తుండటమే దీనికి కారణం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల కొంతమంది సిట్టింగ్ల స్థానాలు పోయాయి. ఇలాంటి వారు కొత్త స్థానాలపై దృష్టి సారించారు. ఆ సెగ్మెంట్లలో పట్టున్న నేత సీటు త్యాగం చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఫలితంగా ఒకే పార్టీలోనే కుమ్ములాటలు తప్పేలా కనిపించడం లేదు. ఇలా సీట్లు దక్కని వారు కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ వైపు అడుగులు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మహాకూటమిలో గుబులు పుట్టుకుంది. ప్రధానంగా తెదేపాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్శింహులు, చెరకు ముత్యం రెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డి, తెరాసకు చెందిన జి.విజయరామారావు, లక్ష్మారెడ్డి, టి.పద్మారావు వంటి ప్రముఖులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ప్రతిష్టాత్మకం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెదెపా-తెరాసలకు చెందిన అభ్యర్థులు 25 చోట్ల ముఖాముఖిగా తలపడ్డారు. ఇందులో ఐదు చోట్ల తెదేపా విజయం సాధించింది. అలాగే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఐదు స్థానాల్లో తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో తెదేపా రెండు సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన తెదేపా అభ్యర్థులు, ఉప ఎన్నికల్లో తెదేపా చేతిలో పరాజయం పాలైన తెరాస అభ్యర్థులు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. ఒక వేళ ఇలాంటి వారికి సీట్లు కేటాయించలేని పక్షంలో వారు ఇతర పార్టీల్లోకి దూకేందుకు సిద్ధంగా ఉంటారన్నది ఎన్నికల సత్యం. మొత్తం మీద మహాకూటమి పార్టీల అభ్యర్థుల్లో అపుడే సీట్ల సిగపట్లు ఆరంభమయ్యాయి. |