ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శల బాణాలను సంధించుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయ బరిలోకి కొత్తగా వచ్చిన పీఆర్పీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తూర్పారబడుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా అవినీతికి కిటికీలు తెరిచింది చంద్రబాబు నాయుడని మెగాస్టార్ చిరంజీవి ధ్వజమెత్తుతున్నారు. రైతుల గోడు పట్టించుకోని తెలుగుదేశం నేడు రైతులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన తీవ్రంగా స్పందించారు. మరోవైపు ఉత్తరాంధ్ర రోడ్ షోలలో నిమగ్నమై ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ప్రజలను కుళ్ల బొడిచే ఆంబోతుతో కాంగ్రెస్ను పోల్చుతూ ముందుకు సాగుతున్నాడు. రాష్ట్రంలోని భూములను సర్వే చేయడానికే వైఎస్ పాదయాత్ర చేశారని ఘాటైన విమర్శలు గుప్పించాడు. తన పాదయాత్రను విమర్శించేవారు "పిచ్చోళ్లు" కింద లెక్క అని పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ను ఎత్తిపొడిచారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులందరూ "ఎన్టీఆర్ వెన్నుపోటును మరిచావా" అంటూ జూనియర్ ఎన్టీఆర్పై విమర్శల బాణాలు వదిలారు.ఇక పీఆర్పీ యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తూ... "జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న చంద్రబాబు తెలుగుదేశం విధానాల గురించి చెపుతున్నాడా...? లేక స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాడో తేల్చాల"ని సూటిగా బాణం వదిలాడు.యువరత్న బాలకృష్ణ, కారంచేడులోని తన అక్కా, బావ ఇంటి ముందు మీసం మెలేసి తొడగొట్టి సవాలు విసిరారు. దానికి దగ్గుబాటి స్పందిస్తూ... బాలకృష్ణ ఓ చిన్న పిల్లవాడనీ, నిక్కర్లు వేసుకునే వయసు నుంచి బాలకృష్ణను తాను చూస్తూ వస్తున్నాననీ, తొడగొట్టిన బాలయ్యను చూసి తనకు నవ్వు వచ్చిందని అన్నారు. మరో వారం రోజుల్లో మరిన్ని విమర్శనాస్త్రాలతో ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఆ నాయకుల షోలను సైతం ప్రజలు బంపర్ హిట్ చేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఏ పార్టీ షో ప్రదర్శిస్తున్నా మెగా హిట్ చేస్తున్నారు. ఇదే రాజకీయ నాయకులకు అంతు పట్టడం లేదు. ఏ రాజకీయ పార్టీకి పట్టం కడతారోనని ప్రతి రాజకీయ పార్టీ మదిలో నేడు ఒకటే గుబులు. తెలుగు ఓటరూ... నిజంగా నువ్వు మహా మహా మేధావివయా. రాజకీయ పార్టీల మెదళ్లలో వేసవి ఎండలకు మించిన వేడిని పుట్టుస్తున్నావుగా... దటీజ్ తెలుగు ఓటర్. |