పల్లెకు పోదాం...(పారును చూద్దాం) చలో... చలో అల్లరి చేద్దాం చలో చలో... అంటూ ఓ సినీ గేయ రచయిత 1953లోనే పల్లెకు వెళదామని పాట రాసాడు. అది సరదాకే కావచ్చు. కాని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. వివరాల్లోకి వెళితే మనిషికి నడక ఎంతో అవసరమన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.
నడక మనిషి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి ఉదయం, సాయంత్రంపూట వాకింగ్ (నడక) చేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వీటి కోసం ప్రత్యేకంగా ప్రతి నగరం, పట్టణాలలో వాకర్స్ క్లబ్లు కూడా ఏర్పడ్డాయనడంలో అతిశయోక్తి లేదు. అంటే తమ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకుంటున్నారనడంలో సందేహంలేదు.
కాని శాస్త్రజ్ఞుల కథనం ప్రకారం పల్లెల్లో చెట్లు చేమల వెంబడి నడిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందట. పైగా మెదడు పని తీరు కూడా మెరుగు పడుతుందట. అంతే కాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయట. పట్నాల్లో రోడ్ల వెంట తిరిగినా రాని ఆరోగ్యం గ్రామాల్లో కనీసం అరగంట తిరిగితే వస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
పల్లెల్లో ఓ గంటపాటు షికారు కెళ్తే మన మెదడు పనితీరు ఐదోవంతు మెరుగుపడుతుందని, అదే సమయం ట్రాఫిక్ రద్దీగావుండే పట్నంలో తిరిగితే మనిషి మెదడు పనితీరులో ఏమంతగా మార్పు కనపడదని వారు తెలిపారు. నడక చేస్తున్నావారు ఇకపై పల్లెల్లో నడక ప్రారంభించండని శాస్త్రజ్ఞులు కోరుతున్నారు.
అలా వీలుకాని పక్షంలో చెట్లు ఎక్కువగావున్నచోటులోనే నడకను సాగించాలని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మార్క్ బెర్మన్ పేర్కొన్నారు. ఈ విషయమై పరిశోధకులు రెండు బృందాలపై పరిశోధనలు నిర్వహించారు.
ఒక బృందాన్ని పల్లెల్లో షికారుకు తరలిస్తే మరో బృందాన్ని పట్నంలో రోడ్లవెంట గంటపాటు నడిపించారు. ఆ తర్వాత రెండు బృందాలలోని వారి మెదడు పనితీరును పలు పరీక్షల ద్వారా తెలుసుకున్నారు.
పట్నంలో తిరిగిన వారిమెదడు పనితీరుకన్నా గ్రామాల్లో తిరిగిన వారి మెదడులో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెరుగ్గా వున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి మన జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడానికి మనం కూడా గ్రామాలవైపు నడక సాగిద్దామా మరి! |