ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న "స్వైన్ ప్లూ"ను "ఎరోసైడ్" టెక్నాలజీతో నిరోధించవచ్చునని "గ్రేట్ వైట్ టెక్నాలజీ" అనే భారతీయ సంస్థ చెబుతోంది. వ్యోమగాముల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిద్ధం చేసిన ఈ ఎరోసైడ్ టెక్నాలజీ ప్రాణాంతక స్వైన్ ఫ్లూను సమర్థవంతంగా అరికట్టగలదని ఆ కంపెనీ పేర్కొంటోంది.నిజానికి... ఎరోసైడ్ టెక్నాలజీని వ్యోమగాములు తీసుకెళ్లే ఆహారం ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉద్దేశించినది మాత్రమే. ఇది గాలిలోని హానికారక సూక్ష్మక్రిములను నాశనం చేయడం ద్వారా ఆహారం చెడిపోకుండా చేస్తుంది. కాగా... ఎరోసైడ్ టెక్నాలజీని భారతదేశంలో అమ్మేందుకు గ్రేట్ వైట్ టైక్నాలజీ సంస్థ హక్కులను కలిగి ఉందన్న విషయం గమనార్హం.ఈ విషయమై గ్రేట్ వైట్ టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ధర్మేష్ కేశ్వానీ మాట్లాడుతూ... ఎరోసైడ్ టెక్నాలజీని గనుక ఇళ్లలో ఉపయోగించినట్లయితే... స్వైన్ ఫ్లూ వైరస్తో పాటు, గాలిలోని దాదాపు అన్ని రకాల బాక్టీరియా, వైరస్లను కూడా నాశనం చేస్తుందని పేర్కొన్నారు.ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ లేదనీ, ప్లాస్మా టీవీలాగా ఉండే ఓ పరికరాన్ని ఇంట్లో అమర్చుకుంటే సరిపోతుందని, అది గాలిని లోపలికి పీల్చుకుని శుద్ధి చేసి బయటకు వదులుతుందని కేశ్వానీ వివరించారు. తాము ఇప్పటికే భారత్లో వెయ్యి పరికరాలను అమ్మామనీ.. హాస్పిటల్స్లో ఎరోసైడ్ను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లను గణనీయంగా తగ్గించగలిగినట్లు ఆయన తెలిపారు.ఇదిలా ఉంటే... శుద్ధి చేయాల్సిన ప్రాంతం పరిమాణాన్ని బట్టి ఎరోసైడ్ ధర ఉంటుందనీ... మూడు వేల నుంచి 20 వేల ఘనపుటడుగుల గాలిని శుద్ధి చేయగల పరికరాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని కేశ్వానీ చెప్పారు. కాగా... ఐదు వేల ఘనపుటడుగుల గాలిని శుద్ధి చేయగల పరికరం ధర దాదాపు లక్ష రూపాయల దాకా ఉంటుందని ఆయన తెలియజేశారు. |