ధూమపానం వల్ల మెదడులోని నాడీ కణాలు దెబ్బతింటాయని... ఇండియన్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్బీఆర్సీ) జరిపిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన దేబప్రియ ఘోష్, అనిర్బన్ బసులు ఈ విషయమై మాట్లాడుతూ... పొగాకులో ఉండే ఎన్ఎన్కే అనే రసాయనం ఇందుకు కారణంగా ఉంటోందన్నారు.పొగాకులో ఉండే ఎన్ఎన్కే రసాయనం నేరుగా క్యాన్సర్కు కారకం కాదుగానీ... శరీరంలోకి ప్రవేశించినప్పుడు శరీర జీవక్రియల వల్ల ఇది క్యాన్సర్ కారకంగా మారుతుందని ఘోష్, బసులు వివరించారు. ఈ రసాయనం మైక్రోగ్లియాగా పిలిచే మెదడులోని రోగ నిరోధకశక్తి కణాలను చైతన్యవంతం చేస్తుందని అన్నారు.సాధారణంగా మైక్రోగ్లియా కణాలు కేవలం దెబ్బతిన్న లేదా హానికరమైన మెదడు నాడీ కణాలను మాత్రమే చంపివేస్తుంటాయని ఘోష్, బసులు పేర్కొన్నారు. అయితే ఎన్ఎన్కే రసాయనం ప్రేరేపించినప్పుడు మాత్రం అవి మెదడులోని ఆరోగ్యవంతమైన కణాలపై కూడా దాడి చేసి చంపేస్తాయనీ, ఇది క్రమేణా నాడీ కణాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వారు వెల్లడించారు.కాబట్టి... పొగాకును ఏ రూపంలో తీసుకున్నా, ఆఖరికి సిగరెట్ పొగ పీల్చినా కూడా ఇదే రకమైన ఫలితాలుంటాయని దేబప్రియ ఘోష్, అనిర్బన్ బసులు తేల్చిచెబుతున్నారు. ఇదిలాఉంటే... ఈ పరిశోధనలకు సంబంధించిన పూర్తి కథనాన్ని "జర్నల్ ఆఫ్ న్యూరోకెమిస్టీ" జూలై సంచికలో ప్రచురించారు. |