వానాకాలం వచ్చిందంటే వేడి వేడి ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. వేడి వేడి పకోడీలు, సమోసాలతోపాటు వేడిగా స్ట్రాంగ్ టీ తాగడానికి ఉత్సాహం చూపిస్తాం. టీ తాగవచ్చు... కానీ అతిగా టీ సేవిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్యులు.
ముఖ్యంగా కొందరికి ఆహారంతోపాటు టీ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆహారంలోని పోషక పదార్థాలను శరీరం గ్రహించడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా ఐరన్ గ్రహించడంలో సమస్య వస్తుంది. శరీరానికి ఐరన్ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
టీ అధికంగా తాగేవారిలో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. చివరికి టీ మోతాదు పెరిగి కడుపులో ఎసిడిటీ వస్తుంది. టీ తాగిన వెంటనే ఉత్తేజభరితంగా ఉంటుంది. అయితే టీ అధికంగా తీసుకునేవారికి దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. టీ తాగగానే ఉత్సాహంగా చదువగలమనుకుంటారు. కానీ ఆ ఏకాగ్రత ఎక్కువసేపు నిలవదు.