శరీరంలోని రక్తంలో గ్లూకోజ్(చక్కెర) శాతం శరీరానికి అవసరమైనంత మేరకన్నా ఎక్కువగా ఉంటే దానిని మధుమేహ వ్యాధి అంటారు. కడుపులో ఖాళీగా ఉన్నప్పుడు శరీరంలోని రక్తంలో సాధారణంగా గ్లూకోజ్ శాతం 110 మిల్లీగ్రాములకన్నా తక్కువ, 75 గ్రాముల గ్లూకోజ్ నీటిని సేవించిన రెండు గంటల తర్వాత 140 మిల్లీగ్రాములకన్నా తక్కువగా ఉంటే ఇది సాధారణమైన పరిస్థితి. కాని మధుమేహ రోగుల్లో ఖాళీ కడుపులోనున్నప్పుడు శరీర రక్తంలో చక్కెర శాతం 126 మిల్లీ గ్రాములుంటుంది. అదే 75 గ్రాముల గ్లూకోజ్ సేవించిన రెండు గంటల తర్వాత శరీరంలో గ్లూకోజ్ శాతం 200 మిల్లీగ్రాములు అధికంగా ఉంటుందంటున్నారు వైద్యులు.
మధుమేహంలోనున్న ప్రధానమైన లక్షణాలు
** అలసట, బలహీనత, కాళ్ళల్లో నొప్పులు. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్ ఉత్పత్తిలో ఏ మాత్రం మార్పులుండవు.
** కాళ్ళకు దెబ్బలు తగిలినప్పుడు వెంటనే మానకపోవడం.
** ఎక్కువగా మూత్రం పోయడం, ఆకలి వేయడంలాంటి లక్షణాలు.
** శరీర బరువు ఉన్నట్టుండి తగ్గిపోవడం.
** తరచూ కంటి అద్దాల నెంబర్లను మార్చడం. అంటే దృష్టి లోపం తలెత్తడం.
** జననాంగాలలో నవ్వ(జిల) ఉండటం.
** గుండెపోటు, మెదడు దెబ్బ తినడం.
ప్రతి రోజు ఇన్స్యులిన్ ఇంజెక్షన్ అవసరం లేదు
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇకపై తమ శరీరంలో గ్లూకోజ్ క్రమబద్దీకరించుకునేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్ మాటిమాటికి వేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఇన్సులిన్ పంప్ వలన ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్యులు.
చాలామందికి బాల్యావస్థలోనుంచే ఈ మధుమేహ వ్యాధి వస్తుంటుందని, ఇది వారి వారి తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుందని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్. మనోజ్ శర్మ అన్నారు. ఇలాంటి వారికి ప్రతి రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలంటే నరకప్రాయంగా ఉంటుంది. వీరికి ఇన్జెక్షన్లనుంచి విముక్తి కలిగించేందుకు ఇన్సులి పంప్ ఎంతో అవసరం ఉందంటున్నారు వైద్యులు. ఇన్సులిన్ పంప్ను ఏ వయసు వారైనా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.
ఇన్సులిన్ పంప్ అంటే ఏమిటి?
ఇన్సులిన్ పంప్ అనేది ఓ పేజర్లా ఉంటుంది. ఇందులో ఇన్సులిన్ వైల్ ఫిక్స్ చేసేస్తారు. దీనిని ఓ పలుచటి నీడిల్, ఇన్ఫ్యూజన్ సెట్ ద్వారా శరీరంలో ఉంచుకోవాలి. ఈ పంప్ శరీరానికి కావలసిన ఇన్సులిన్ను రక్తంలో కలుపుకుంటుంది. దీంతో ప్రత్యేకంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ను వాడాల్సిన అవసరం ఉండదంటున్నారు వైద్యులు. ఇది శరీరంలో తయారయ్యే ఇన్సులిన్లాగే ఇన్సులిన్ను శరీరానికి సరఫరా చేస్తుందని ఆయన అన్నారు.