* పెరట్లో పెంచే ఆకుకూరల్లో ఫైటో కెమికల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఈ ఫైటో కెమికల్స్కు గుండె జబ్బు, క్యాన్సర్, మధుమేహ వ్యాధులు రాకుండా చేసే లక్షణం ఉంటుంది. ఆకు కూరలకు మానవ శరీరంలోని క్రిములను నశింపజేసే గుణం ఉంది. రక్తలేమి, బలహీనతతో ఇబ్బందిపడుతున్న వారికి ఆకు కూరల్లో లభించే ఐరన్ స్వస్థతనిస్తుంది. ఆకు కూరలకు ఎసిడిటీ సమస్యను తగ్గించే లక్షణం ఉంది.
* పాలకూర, బ్రకోలి లాంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి శరీరంలోని కణజాలం త్వరగా పాడవకుండా ఉండేందుకు సహాయపడతాయి. పాలకూరలో ఇనుము, విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రక్తలేమికి మంచి మందుగా పనిచేస్తుంది. పాలకూరలో ఉండే ఖనిజాలు ఎసిడిటీని తగ్గిస్తాయి. ఆస్పరాగస్ అనే మరో కూరలో విటమిన్ సీ, ఫోలేట్లు సమృద్ధిగా లభిస్తాయి.
* ఆకు కూరల్లో మెంతికూరను రారాణిలా చెప్పవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్ను నివారించటమేగాక దగ్గు, వాంతులు, పొట్టలో నులిపురుగులు, కీళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలకు మెంతి కూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువస్థాయిలో ప్రొటీన్లు, క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము ఉన్నాయి. అలాగే ఇందులో ఖనిజాలు, విటమిన్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
* సహజంగానే ఆకు కూరల్లో కొవ్వు, సోడియం, కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు అవసరమైన పీచు పదార్థం ఆకు కూరల్లో అధికంగా ఉంటుంది. శరీరంలోని, ప్రేగుల్లోని బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం ఆకుకూరల్లోని పత్రహరితాలకు ఉంది. ఆకు కూరలను పచ్చిగానే నమలటంవల్ల పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాల ముక్కలను బయటికి తీసుకొస్తాయి. అలాగే పళ్లకు హానిచేసే క్రిములను నాశనం చేస్తాయి.