ఆయుష్షును పెంచుకునేందుకు సంతోషంగా ఉండటమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయం నమ్మవచ్చంటారా...!నిజమేనని చెబుతున్నారు మానసిక వైద్యనిపుణులు. ఎవరైతే ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతుంటారో అలాంటివారి ఆయుష్షు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఈ మధ్య జరిపిన పరిశోధనల్లో పై విషయం వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి ఆయుష్షును పెంచుకోవడానికి మందులు, మాకులు అవసరం లేదని వైద్యులు తెలిపారు. కేవలం హాయిగా జీవితాన్ని గడపడం వస్తే చాలంటున్నారు మానసిక వైద్యనిపుణులు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే..అదేంటంటే...జీవితంలో ప్రతి చిన్న సమస్య వచ్చినాకూడా దానిని పెద్ద భూతద్దంలో చూసి చలించకూడదంటున్నారు మానసిక, ఆరోగ్య వైద్య నిపుణులు. జీవితంలో ఒడిదుడుకులు సహజమే. అలాగని ప్రతి చిన్న విషయానికి తల్లడిల్లిపోవాల్సిన అవసరం లేదంటున్నారు. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఎవరైతే తమ జీవితంలో వచ్చే సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోగలుగుతారో అలాంటి వారి ఆయుష్షు ఎక్కువగా ఉంటుందని, వారు జీవితంలో అనుకున్నది సాధించగలరని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మనిషిలో అరిషడ్వర్గాలు అనేటివి సహజంగా ఉండే లక్షణాలు. వీటిలో ఈర్ష్య అనే గుణం మనిషిలోని ఆయుష్షును క్షీణింపజేస్తుంది. దీంతో మనిషి త్వరగా మృత్యువుకు దగ్గరవుతుంటాడు. ఇప్పటివరకైతే కేవలం మనిషి ఆయుష్షుకు సుఖం అనేదిమాత్రం ఇదమిద్దంగాచెప్పలేమంటున్నారు వైద్యులు. కాని పరిశోధనల్లో తేలిన విషయాలేమంటే ఎవరైతే సుఖ సంతోషాలతో మానసికంగా ఆనందాన్ని పొందుతుంటారో అలాంటివారు జీవితాంతం ఆరోగ్యంగానూ, ఎక్కువ ఆయుష్షు వరకు జీవిస్తుంటారని మానసిక వైద్యులు తెలిపారు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే ...సానుకూల దృక్పథం(పాజిటివ్ థింకింగ్)తో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. మానసికంగా ఎవరైతే ఆనందంగా ఉంటారో, అలాంటివారు ఎక్కువ కాలం జీవిస్తారని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుడు డాక్టర్. హావర్డ్ ఎస్. క్రైడ్ తెలిపారు. దీనికి ఆయన ఉదహరిస్తూ... మనో విశ్లేషణ సిద్ధాంతాలను రూపొందించిన సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తెలియనివారంటూ ఉండరు. అలాంటి వ్యక్తి తన జీవిత కాలంలో సంతోషంగా గడిపినందులకే ఎక్కువ కాలం జీవించారని ఆయన తెలిపారు. 660 మందిపై పరిశోధన చేసిన వారిని ప్రశ్నిస్తే వారి సమాధానం ఏంటంటే.. వారు చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో...ఇప్పుడుకూడా అంతే ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారని తెలిపినట్లు పరిశోధనలో తేలిందని ఆయన వివరించారు. తమ వయసు ముదిరేకొద్దీ చాలా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామని వారు సమాధానమిచ్చినట్లు క్రైడ్ తెలిపారు. నిరాశతో జీవితాన్ని గడిపేవారిలో రక్తపోటు సమస్య అధికంగా కనపడుతుంటుందని, నియమానుసారం ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. ఇలా నాలుగు సంవత్సరాలు జరిగితే మృత్యువుకు దగ్గరలోనే ఉన్నట్లు భావించాలని వైద్య నిపుణులు తెలిపారు. కాబట్టి ఇలాంటి వారు తమ శరీర బరవుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు వైద్యులు. అలాగే ధూమపానం, మద్యపానం చేయకుండా నియమానుసారం వ్యాయామంతోబాటు ఆహారం కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. మనిషి వయసు పెరిగేకొద్ది తాము తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేయాలని, శారీరక సంబంధాలను క్రమపద్ధతిలో పాటిస్తూ, ఆర్థిక స్థితిగతులపై అవగాహన పెంచుకోవాలని, శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మానసిక పరిపక్వతను పెంచుకోవాలని వైద్యులు డాక్టర్. బీకీ లేవీ సూచిస్తున్నారు. తమ ఆయుష్షును పెంచుకునే విషయంలో భాగంగా ముదిమి వయసును నియంత్రించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలనుకూడా పాటించాలని లేవీ తెలిపారు. ముదిమి వయసు ప్రారంభమైందని తెలియడంతోనే సానుకూల ధోరణిని అవలంబిస్తే సమస్యే ఉత్పన్నం కాదని ఆయన సూచిస్తున్నారు. ఆయుష్షును పెంచుకునే విషయంలో భాగంగా తమ వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకురావాల్సివుంటుంది. వ్యక్తిత్వమనేది స్థిరమైన జీవితం. కాని ఆలోచనలను నిలుపుదల చేస్తే ముదిమి వయసునుకూడా దూరం చేయవచ్చని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. |