'ఏంరా...! వర్షాకాలం కదా... జర జాగ్రత్తగా ఉండు... యాడపడితే ఆడ అడ్డమైనది తిని తలకు తీసుకు రావద్దు. నీకు ముందే ఆరోగ్యం అంటే లెక్కలేదు. అసలే వర్షాకాలం లేని జబ్బులు వస్తాయి జాగ్రత్తరా.... ఆసుపత్రిల చుట్టూ తిరగాల' ప్రస్తుతం ఈ సంభాషణ దాదాపుగా ప్రతి ఇంటిలో జరుగుతుంటుంది. అంటే ఈ సీజన్ అలాంటిది. ఏది తినాలన్నా జాగ్రత్త తీసుకోక తప్పదు. వర్షాకాలంలో ముందు జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే.
దీంతో చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. పెద్దగా దాహం వేయదు. ఇదంతా వర్షాకాలం ప్రభావం కాబట్టి దాహం వేయదు. శరీరానికి కావలసిన నీరు ఖచ్చితంగా కావాలసిందే. దాహం వేసినా, దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలి. కాకపోతే తాగేనీరు కలుషితం కాకుండా చూడాలి.
వర్షాకాలంలో పచ్చికూరగాయలు తినడం అంత మంచిది కాదు. అందులో క్రిములు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కూరగాయలు ఆవిరిలో ఉడికించి తినడం మేలు. సాధారణ పరిస్థితులలో మొలకలెత్తిన గింజలు తినడం శరీరానికి చాలా మంచిది. కానీ ఈ సీజన్లో మొలకల్లో ఉండే చెమ్మకారణంగా ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. మొలకలెత్తిన గింజలు తినడాన్ని నిలిపేయడం మంచిది.
శీతలపానీయాలు సేవించడం నిలిపివేయాలి. గొంతుకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వేడి సూప్లు తాగడం మేలు. వాతావరణం చల్లగా ఉన్న కారణంగా ఎక్కువగా తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల పరిమితంగా తినడం మంచిది.
అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు, జీలకర్ర జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు బాగా కడిగి వండుకోవాలి. మాంసాహారం కూడా వేపుళ్లు కాకుండా సూప్ల రూపంలో తీసుకోవడం మంచిది. వరి అన్నం తినడాన్ని తగ్గించి ఆహారంలో మొక్కజొన్న వినియోగం పెంచాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
|