1947లో జరిగిన భారత్-పాకిస్థాన్ విభజన ఈ కథకి నేపథ్యం అయ్యింది. పిల్లల మధ్య స్నేహానికి ఏ ముళ్ళతీగల సరిహద్దులు అడ్డురావని ముకంద్-రియాజ్ చాటి చెప్పుతున్నది. ముఖ్యంగా కథారచయిత జీవితంలో చోటు చేసుకున్న సంఘటన కావడంతో కథకు సహజత్వం అబ్బింది. పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం, భారత్లోని గుజరాత్ రాష్ట్రంలోని స్త్రీలు ఒకే తీరులో రూపొందించే అప్లిక్ పనితో కూడిన బొంతల బొమ్మలతో ఈ కథలోని దృశ్యాలను నవ్యరీతిలో అలంకరించారు.
స్నేహం, బాల్యం అనేవి పిల్లలకు మాత్రమే చెందినవనీ, బాల్యంలో ఆడుకున్న ఆటలు, కలిసి తిన్న తినుబండారాలు, పంచుకున్న వస్తువులు, తమకు ఇష్టమైన వస్తువుల పట్ల పిల్లలు పెంచుకునే బాంధవ్యం మరుపురానివిగా ముకంద్-రియాజ్ కథ తెలియచేస్తున్నది.
అదే సమయంలో జ్ఞాపకాల దొంతరలు పిల్లలకు జీవితం పట్ల సరియైన అవగాహనను పెంపొందించడంతో పాటు సమస్యలను ఎదుర్కుని ముందుకు పోగలిగే ఆత్మస్థైర్యాన్ని వారిలో కలిగిస్తాయని ఈ కథ అన్యాపదేశంగా వెల్లడిస్తున్నది. నిజమైన స్నేహానికి అద్దం పట్టే ముకంద్-రియాజ్ కథ నేటి బాలలకు అనుబంధాల ప్రాధాన్యతను సరళంగా బోధిస్తుంది.
రచయిత: నీనా సబ్నాని; అనువాదం: డి. వసంత; పేజీలు: 36; వెల రూ. 100. ప్రతులకు తులికా పబ్లిషర్స్, 13 పృధ్వీ ఎవెన్యూ, అభిరామపురం, చెన్నై - 600 018.
|