నగరానికి చెందిన మానవ సంక్షేమం మరియు ప్రభుత్వ అంగవికల బాలుర వసతి గృహంలోని బాలలకు సోమవారం ఓ మధురానుభూతిని మిగిల్చింది. సోమవారాన్ని వారు ఎన్ని వారాలు గడిచినా మర్చిపోలేరు.
మానవ సంక్షేమ మండలి హైదరాబాద్ విభాగానికి చెందిన అల్కాపురి వసతిగృహానికి చెందిన 40 మంది వీధి బాలలు మరియు నల్గొండ క్రాస్ రోడ్డుకు సమీపంలోని ప్రభుత్వ అంగవికల బాలుర వసతి గృహానికి చెందిన 27 మంది బాలలు బోరబండలోని విజేత సినిమా హాలులో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజా చిత్రమైన "ఓం శాంతి ఓం సినిమా"ను చూశారని ఈ మేరకు ఒక పత్రికాప్రకటన పేర్కొంది.
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఫ్రీమ్యాసోన్రీ సంస్థ స్థానిక విభాగమైన లాడ్జి కీస్ నెం.297 చిత్ర ప్రదర్శనను నిర్వహించింది. "విలాసవంతమైన బస్సును చూడగానే మేము సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ అందులో ప్రయాణించాము.
మాకిది తొలి అనుభవం. ఇక ఫ్రీమ్యాసోన్రీ సంస్థ సభ్యులతో కలిసి కొత్త చిత్రాన్ని చూడటం నా జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుందని" అంగవికలాంగ బాలుడు నరేంద్ర పేర్కొన్నాడు.
"మూడు గంటలపాటు తమను తాము మరిచిపోయి సినిమాను చూస్తున్న పిల్లల ముఖాల్లో అంతులేని ఆనందాన్ని చూశానని" ప్రదర్శన నిర్వాహకులు డి. రామచంద్రం అన్నారు.
|