స్కూలు పిల్లలకు కీబోర్డ్ కంటే పెన్ను (కలం) మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అక్షరమాల, వాక్యాలు, వ్యాసాలను రాసేటప్పుడు పిల్లలు కీబోర్డ్ ద్వారా టైప్ చేయటంకంటే పెన్నుతో రాయటమే మంచిదని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఎందుకంటే.. పెన్నుతో రాసేటప్పుడు పిల్లలు వేగంగా రాయటమేగాకుండా, ఎక్కువగా రాసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
వివరాల్లోకి వస్తే.. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ విర్జీనియా బెర్నింజర్... రెండవ, నాల్గవ, ఆరవ గ్రేడ్ పిల్లలు ఆల్ఫాబెట్స్, వాక్యాలు, వ్యాసాలు రాసే సమయంలో వారి శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ఈ పరిశీలనలో పెన్నుతో రాసిన పిల్లలు వేగంగాను, ఎక్కువగా రాస్తున్నట్లు ఆమె గమనించారు. అదే విధంగా కీబోర్డ్ ద్వారా టైపింగ్ చేస్తున్న పిల్లలు వెనుకబడి ఉన్నట్లు బెర్నింజర్ గుర్తించారు.
రెండూ అవసరమేగానీ..!
వేటి ఉపయోగాలు వాటికి ఉన్నాయి కాబట్టి.. కీబోర్డు, పెన్నులలో వేటినీ పక్కకు తీసేయాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు రెండూ అవసరమేనని బెర్నింజర్ తేల్చి చెప్పటం కొసమెరుపు...
అయితే ఆల్ఫాబెట్స్ రాసే విషయంలో పెన్ను కంటే కీబోర్డ్ ద్వారానే పిల్లలు వేగంగా రాయగలుగుతున్నట్లు బెర్నింజర్ గుర్తించారు. కాబట్టి కీబోర్డ్ ఉపయోగాన్ని కూడా తోసిపుచ్చలేమనీ.. అయితే పెన్ను ద్వారానే స్కూలు పిల్లలకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని ఆమె సూచించారు.
పెన్ను ఉపయోగించి రాసే విద్యార్థులు మొదటి మూడు గ్రేడుల్లోనూ నిడివి ఎక్కువగా ఉండే పెద్ద వ్యాసాలను సైతం చాలా వేగంగా రాసేయగలరని బెర్నింజర్ తెలిపారు. అలాగే నాలుగు, ఆరు గ్రేడుల్లోని విద్యార్థులు పెన్నుతో బోలెడన్ని పూర్తి వాక్యాలను రాసేస్తారనీ.. ఇది వారి స్పెల్లింగ్ నైపుణ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.
అయితే.. ప్రాథమిక స్థాయి విద్యార్థులు కంప్యూటర్ గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెర్నింజర్ అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో పిల్లలకు కంప్యూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి గురించి పాఠాలు మాత్రం అందటం లేదన్నారు.
కాబట్టి.. చిన్నపిల్లలకు ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ కీబోర్డ్తోనూ, పెన్నుతోనూ రాసే అలవాటును చేయించాలి. వేటి ఉపయోగాలు వాటికి ఉన్నాయి కాబట్టి.. కీబోర్డు, పెన్నులలో వేటినీ పక్కకు తీసేయాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు రెండూ అవసరమేనని బెర్నింజర్ తేల్చి చెప్పటం కొసమెరుపు.