ఈ రకంగా జాతిని ఉత్తేజపరచి, ఆసేతు హిమాచలాన్ని నిద్రలేపిన గీతంగా, గుండె గుండెనూ తట్టి సమరానికి సిద్ధంచేసిన గీతంగా, బానిస సంకెళ్లను తెంచుకొని కలసికట్టుగా ముందుకు ఉరకండని సమర భారతీయులందర్నీ ఒక్కటిచేసిన గీతంగా కొనియాడబడింది వందేమాతర గీతం. దేశమంటే మట్టే కాదనీ, మనుషులే కాదనీ, అదొక అనిర్వచనీయ ఆధ్యాత్మిక శక్తి అని, నైతిక బలమనీ, శతాబ్దాల చరిత్ర సాక్షిగా నిలిచిన మానవకోటి మందిరమని, జాతి జనుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ తెలిపి, కలిపిన గీతమిది.
అన్నట్టు ఈ వందేమాతర గీతాన్ని మొదటగా ఆలాపించింది మన జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ టాగూరే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఆయన ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గానం చేశారు. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నాయకురాలు సుచేతా కృపలానీ కూడా దీనిని పాడారు.
ఇక రచయిత్రి సరళాదేవి చందురాణి 1905లో జరిగిన బెంగాల్ కాంగ్రెస్ సమావేశంలో వందేమాతర గీతాన్ని పాడి సభికులను ఉర్రూతలూగించారు. అలాగే, ‘వందేమాతరం’ పేరుతో జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతి రాయ్ లాహోర్ నుంచి జర్నల్ను ప్రారంభించారు. ఈ గేయాన్ని శ్రీఅరబిందో ఆంగ్లంలో, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి తమిళంలో అనువదించారు.
మాతృభూమిపై ప్రేమ కురిపించే చక్కటి సాహిత్యం, పరాయి పాలనను నిరసించే పదునైన పదాలు... వందేమాతర గీతం ప్రత్యేకత. ఈ గీతానికి ఎంతో చారిత్రక, సంప్రదాయ నేపథ్యం ఉంది. ఈ పాట స్వాతంత్ర్యోద్యమాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తూ, జాతీయ గీతాలకు ప్రేరణగా నిలిచింది. "వందేమాతరం భారత జాతికి బెంగాల్ సమర్పించిన విలువైన కానుకల్లో ఒకటి" అని మహాత్ముడే వ్యాఖ్యానించారంటే, ఈ గీతానికున్న విలువ ఏపాటిదో అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే... బ్రిటీష్వారు "ఛటోపాధ్యాయ" పేరును సరిగా పలకలేక "ఛటర్జీ" అని పిలువసాగారు. ఇక అప్పటినుంచి ప్రజలందరూ కూడా బ్రిటీష్ వారిని అనుకరిస్తూ ఆయనను ఛటర్జీ అనే పిలవడం ప్రారంభించడంతో, ఆయన బంకించంద్ర ఛటర్జీగానే కొనసాగారు. తాను రాసిన వందేమాతర గీతంతో జాతి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ, 1894వ సంవత్సరం ఏఫ్రిల్ 8వ తేదీన కాలధర్మం చెందారు. |