ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన "రాయప్రోలు"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన "రాయప్రోలు"
FILE

"ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము"


అంటూ "జన్మభూమి" గీతాన్ని రచించి.. తెలుగు జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. తెలుగు నవ్య కవితా పితామహుడిగా పేరుగడించిన ఈయన పరమపదించిన రోజుగా చరిత్రలో జూన్ 30వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు. “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా ఆయన సృజన చేశారు.

ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.
ఉత్తమ దేశభక్తి ప్రబోధం
  రాయప్రోలు సుబ్బారావు రాసిన గీతాలలో అందరినోళ్లలోనూ బాగా నానిన "జన్మభూమి" గీతంలో తెలుగుదనం, జాతీయాభిమానం, గత వైభవ సంకీర్తనం, ప్రబోధం లాంటివి తొణికిసలాడుతుంటాయి. ఇప్పటికీ ఈ గీతం ఉత్తమ దేశభక్తి ప్రబోధంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు...      


ఈ క్రమంలో... “అవమానమేలరా! అనుమానమేలరా! భారతీయుడనంచు భక్తితో పాడ”
“లేరురా మనవంటి వీరులింకెందు”
“ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడవీ స్వర్గ ఖండమున” అనే రాయప్రోలు గీతాలు భారత జాతిపై వారికి కల అభిమానానికి నిదర్శనాలు. తమ్ముడా గేయంలో రాయప్రోలు కీర్తించిన జాతి ఔన్నత్యం ప్రజలను ఉత్తేజితులను చేసింది.

నవ్య కవితా పితామహునిగా పేరుతెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984) తెలుగులో భావ కవిత్వానికి ఆద్యుడుగా చెప్పవచ్చు. ఈయన 1913లో రాసిన 'తృణకంకణం'తో తెలుగు కవిత్వంలో 'నూతన శకం' ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.

కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్సు దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.

అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. తెలుగు, సంస్కృత భాషా పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన రచించిన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి.

అలా రాయప్రోలు సుబ్బారావు రాసిన గీతాలలో అందరినోళ్లలోనూ బాగా నానిన "జన్మభూమి" గీతంలో తెలుగుదనం, జాతీయాభిమానం, గత వైభవ సంకీర్తనం, ప్రబోధం లాంటివి తొణికిసలాడుతుంటాయి. ఇప్పటికీ ఈ గీతం ఉత్తమ దేశభక్తి ప్రబోధంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు భాషను, ఆంధ్రరాష్ట్రాన్ని అమితంగా ప్రేమించి, తన గీతాలతో ఉత్తేజితులను చేసి, తిరిగిరాని లోకాలకు తరలిపోయిన రాయప్రోలు సుబ్బారావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...!!!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆసేతు హిమాచలాన్ని తట్టిలేపిన "గీతం"
"కపిల్ డేర్ డెవిల్స్" చరిత్రలో సువర్ణాధ్యాయం
"గాలివాన" రచయిత పద్మరాజు జననం
బాలల ప్రేమ మందిరం "జవహర్ బాలభవన్"
గ్రాహంబెల్ తొలి "వాణిజ్య టెలిఫోన్ సర్వీసు"
కుహు కుహూ రాగాల "బర్డ్ మేన్" సలీం అలీ