ఒక ఊరిలో రంగడు, సింగడు అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతి రోజూ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాడు. సింగడు మాత్రం పేదవారికి సాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. కష్టపడకుండా పైకి రావాలని ఆశించే వాడు ఎప్పుడూ.
రోజూ లాగానే ఆ రోజు కూడా రంగడు, సింగడు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసి పోయి చెట్టు క్రింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దెయ్యం అతన్ని చూసింది. రోజూ అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే.
అతని గురించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గిర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణేలు ఉన్న మూటను అతని ప్రక్కనే పెట్టి వెళ్లిపోయింది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియలేదు. అయినప్పటికీ, తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని దాన్ని ఇంటికి తీసుకెళ్లి తనలాగే కష్టపడే వాళ్లకి పంచిపెట్టాడు.
|