సూర్యచంద్రులు క్షమాపణలు చెబితే సరే సరి.. లేదంటే..?
FILE
వాల్మీకిపురం మహారాజు చిత్రగుప్తుడు. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లంటూ హఠం చేసే ఓ మూర్ఖశిఖామణి. ఒకరోజు రాత్రిపూట ఆయన ఉద్యానవనంలో సంచరిస్తుంటే.. ఆకాశంలో వెన్నెల వెండి వర్షం కురిపిస్తున్నట్లుగా ఉంటుంది. తదేకంగా చందమామను చూసిన ఆ రాజుకు ఎంతో అసూయ కలిగింది.
ఆ క్షణంలో చంద్రుడు తనకంటే ఉన్నతమైనవాడిగా తోచాడు. అంతేగాకుండా సూర్యుడు, నక్షత్రాలు సైతం తన తలపైనే ఉంటారనే విషయం ఆయనకు గుర్తుకొచ్చింది. తన సింహాసనంకంటే ఎత్తులో వారుండటం అవమానంగా తోచింది చిత్రగుప్తుడికి. వారి సంగతి ఎలాగైనా సరే తేల్చాల్సిందే అనుకుంటూ తన భవంతిలోకి వెళ్లిపోయాడు.
మరుసటి రోజున సభలో మంత్రి వీర వర్మతో.. "మహామంత్రీ..! ఈ ప్రపంచంలో నాకంటే ఉన్నతమైన వ్యక్తులున్నారా..?" అంటూ ప్రశ్నించాడు. మహారాజు అసలే మొండితనం, మూర్ఖత్వం కలగలిసినవాడని తెలిసిన మంత్రి తెలివిగా.. "ఎవరూ లేరు ప్రభూ..!" అంటూ వినయంగా సమాధానం చెప్పాడు.
"పోనీ.. ఉన్నతులుగా నటిస్తున్నవారు ఉన్నారు. నీకు తెలుసా..?" అని అడిగాడు రాజు. వెంటనే "ఎవరు ప్రభూ.. ఆ దుర్మార్గులు. వారికి శిరచ్ఛేదం విధిద్దాం. వారెవరో సెలవివ్వండి" కాస్తంత కోపం నటిస్తూ అడిగాడు వీర వర్మ.
"వాళ్లవరో కాదు మహామంత్రీ... సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే. తక్షణం వారు ఆకాశం వీడి వచ్చి నాకు క్షమాపణలు చెబితే సరి. లేకపోతే, వారిపై దండయాత్ర చేద్దాం. క్షమాపణలు చెప్పిస్తారో, యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారో రెండుదినాల్లో తేల్చండి. నా మనస్సు అవమానభారంతో రగిలిపోతోంది" అంటూ సభలోంచి విసవిసా అంతఃపురంలోకి వెళ్లిపోయాడు మహారాజు.
సభికులతోపాటు వీర వర్మ, విదూషకుడు రాయవర్మలు తెల్లముఖం వేశారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించే బాధ్యత మీదే మహామంత్రీ.. అన్నట్లుగా అందరూ వీర వర్మవైపు తదేకంగా చూశారు.