పార్వతీపురంలో శీనయ్య అనే పండ్ల వ్యాపారి ఉండేవాడు. అతను పరమ పిసినారే కాకుండా, మితిమీరిన అహంకారంతో నడుచుకునేవాడు. ఓరోజు అతని అంగడిగుండా ఓ సన్యాసి చిన్న పిల్లవాడిని వెంటబెట్టుకుని వెళుతున్నాడు. ఇంతలో ఆ పిల్లవాడు ఆకలిగా ఉందని చెప్పటంతో, సన్యాసి అంగడివద్ద ఆగాడు.
వెంటనే శీనయ్యను "బాబూ.. పిల్లవాడు ఆకలిగా ఉందంటున్నాడు. ఓ పండును దానం చేయవూ..?" అని అడిగాడు సన్యాసి. అది విన్న శీనయ్య ఎగాదిగా చూసి, వెటకారంగా నవ్వుతూ.. "కాషాయం బట్టలతో సన్యాసం వెలగబెడుతున్న సాములోరికి చిన్నపిల్లాడు ఎక్కడినుంచి ఊడిపడ్డాడో..!!" అని అన్నాడు
"ఈ పిల్లాడొక అనాధ నాయనా.. ఎవరూలేక దారిలో ఏడుస్తుంటే వెంట తీసుకుని వెళుతున్నాను" అని బదులిచ్చాడు సన్యాసి. దానికి మరింత ఎగతాళి చేసిన శీనయ్య "తమరు తపస్సులు గట్రా చేసే సాములోరు కదా.. ఆకలి లేకుండా మంత్రం ఏదైనా వేయరాదూ...? అలా చేస్తే అడుక్కునే బాధయినా తప్పుతుంది కదా.." నవ్వుతూ అన్నాడు.
"ఆకలి దప్పికలనేవి మానవులందరికీ సహజమైనవే నాయనా.. వాటికోసం మహిమలను ఉపయోగించటం తప్పు కదా.." చాలా సహనంగా బదులిచ్చాడు సన్యాసి. దానికి పెద్ద పెట్టున శీనయ్య నవ్వుతూ.. "ఆహా.. తమరికేదో పెద్ద మహిమలున్నట్లు.. మేము నమ్మాలా.. అది సరేగానీ నువ్వు పట్టుకున్న కర్రకేదో పండు మూట కట్టినట్లుగా ఉందే, దాన్ని ఆ పిల్లాడికిస్తే సరిపోతుంది కదా..!!" అంటూ ఆరా తీశాడు.