అనగనగా ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఓ పాముల పుట్ట ఉండేది. ఆ పుట్టలో చాలా పాములుండేవి. అయినా అవి ఏరోజు గొడవపడకుండా ఎంతో ఐకమత్యంగా జీవిస్తుండేవి. ఒకరోజున బాగా బలిసిన ఒక ముళ్లపంది పాముల పుట్టకు దగ్గరగా వచ్చింది. దాని శబ్దానికి ఉలిక్కిపడిన పాములు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి.
"ఏయ్ ముళ్లపందీ.. మా పుట్టదగ్గరికి వచ్చి అలా గొణుగుతూ నిల్చున్నావేంటి..?" అంటూ హెచ్చరికగా అడిగాయి పాములు.
"ఆ మరేం లేదు పాములూ.. తిండి కాస్త ఎక్కువగా దొరకటంతో ఆబగా తినేశాను. భుక్తాయాసం ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకునేందుకు ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే ఎక్కడ చూసినా పక్షుల కూతలు, ఇతర జంతువుల శబ్దాలతో ఒకటే రొదగా ఉంది. అందుకే మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి, తరువాత వెళ్లిపోతాను" బ్రతిమలాడుకుంటూ అడిగింది ముళ్లపంది.
"అయినా మా పుట్టలో ఇప్పటికే చాలా పాములున్నాయి. మాకే చోటు సరిగా సరిపోవటం లేదు. ఇప్పుడు నీకు చోటివ్వాలంటే మాకు బాగా కష్టమైపోతుంది. ఎలా..?!" అన్నాయి పాములు.