రామాపురం అనే ఊర్లో రాజయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు కష్టపడి పనిచేస్తూ.. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేవాడు. కానీ రెండోవాడు మాత్రం తల్లిదండ్రుల పనుల్లో ఏ మాత్రం సాయపడకపోగా, సోమరిపోతుగా, జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతుండేవాడు.
ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు, నలతగా ఉన్నప్పుడు తండ్రి చిన్నకొడుకును పిలిచి.. "ఈరోజు నేను పొలంపనికి వెళ్లలేను, నువ్వెల్లి వరిపొలానికి నీళ్లు పట్టేసి రా నాయనా..?" అని అడిగేవాడు. అయితే సోమరితనానికి బాగా అలవాటు పడిపోయిన చిన్నకొడుకు ఏదో ఒక సాకు చెప్పి సులభంగా తప్పించుకునేవాడు.
కాలం ఇలా గడుస్తుంటే.. ఒకరోజున తన స్నేహితుడైన రామయ్యతో రాజయ్య మాట్లాడుతూ.. "నా ప్రాణం ఉన్నంతవరకు చిన్నవాడిని ఎలాగైనా సరే పోషిస్తాను. నా ప్రాణం కాస్తా పోతే, వీడెలా బ్రతుకుతాడో"నని వాపోయాడు. దాంతో స్నేహితుడిని ఊరడించిన రామయ్య "నీ కొడుకును ఎలాగైనా సరే నేను మారుస్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టు" అని అన్నాడు.
మరుసటి రోజున వాకిట్లో కూర్చుని పళ్లు తోముకుంటున్న రామయ్యకు.. దార్లో రాజయ్య చిన్నకొడుతూ స్నేహితులతో కలిసి వెళుతుండటం కనిపించింది. వెంటనే అతడిని పిలిచిన రామయ్య.. "రోజంతా ఇలా జులాయిగా తిరుగుతూ ఉండకపోతే మీ నాన్నకు పొలం పనుల్లో సాయం చేయవచ్చుగా..!!" అని అన్నాడు.
"ఆరుగాలం కష్టపడితే వచ్చేవి నాలుగు గింజలే. అలాంటి పని నావల్ల కాదు. నేను ఏదైనా పనిచేస్తే బోలెడన్ని డబ్బులు రావాలి. అలాంటి పని అయితేనే చేస్తాన"ని బల్లగుద్ది మరీ చెప్పాడు రాజయ్య చిన్నకొడుకు. దానికి చిరునవ్వు నవ్విన రామయ్య "అయితే నీకు మంత్రపు గింజలు కావాల్సిందేరా..!!" అన్నాడు.
"మంత్రపు గింజలా.. అవేంటి..? అయినా అవెందుకు..?" అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రాజయ్య చిన్నకొడుకు. "మరేం లేదురా.. వాటి గురించి నాకు ఓ స్వామీజీ చెప్పాడు. ఆ మంత్రపు గింజలను పొలంలో నాటి, వాటికి ప్రతిరోజూ నీళ్లు పోసి కాపాడితే.. వాటిలో గింజలకు బదులుగా డబ్బులు కాస్తాయట..!" అన్నాడు రామయ్య.