"అయ్యా! తమరి దర్శనార్ధం ఒక వ్యక్తి వచ్చి వున్నాడు. లోపలకు పంపమంటారా?" ఆరడుగుల ఆజానుబాహుడు వంగి వంగి మరీ వినయంగా చెప్పాడు రెవెన్యూమంత్రి రంగారావు గారితో. చెక్క ఊయలమీద కూర్చుని వున్న రంగారావు రెండునిమిషాలు ఆలోచించి "వచ్చిందెవరు? ఏం పని మీద వచ్చాడు?" అన్నాడు.
"తమ నియోజక వర్గానికి చెందిన వ్యక్తే . ఊరు కృష్ణాపురం. పేరు రామయ్య. వచ్చిన పని తెలియదు. మీతోనే విన్నవించుకోవాలంటున్నాడు" చెప్పాడా ఆజానుబాహుడు.. "ఆ రాగి చెంబులోని మంచితీర్ధం కంచుగ్లాసులో పోసివ్వు" స్టూలు మీదున్న రాగి చెంబువైపు చూస్తూ చెప్పాడు మంత్రి. సెక్రటరీ ఇచ్చిన గ్లాసు చేతికి తీసుకొని తాపీగా త్రాగి త్రేన్చి-
"వచ్చినతన్ని లోపలకు పంపించు" అన్నాడు మెల్లగా. రంగారావుగారు దాదాపు గాంధేయవాదిలా వుంటారు. పత్రికల్లో విలేఖర్లు ఆయన మంచితనాన్ని నిరాడంబరత్వాన్ని గూర్చి ఆర్టికల్స్ రాస్తుంటారు. "దండాలయ్యా! " వినయంగా నమస్కరిస్తూ కుటీరం లోపలికి వచ్చాడు రామయ్య. అతడి వెంటే నిల్చున్నాడు సెక్రటరీ.
"నువ్వు కృష్ణాపురం రామయ్యవు కదూ!" కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాడు. "అవునయ్యా! తమరి గెలుపు కోసం రాత్రింబవళ్ళు కష్టపడిన విషయం తమరికి గుర్తుండే వుంటుంది." అన్నాడు ఆనందంగా. "ఊర్లో మనవాళ్ళందరూ బాగున్నారా? అయినా ఏం పని మీద వచ్చావు?" నెమ్మదిగా అడిగాడు. "అయ్యా! నాకున్నది రెండెకరాలు అనాధీనం భూమి. దాని పక్కనే వున్న వందెకరాలు ఎవరో గణపతిరావంట ఆయన పట్టా చేయించుకున్నాడు.
|