"సార్ చదువుకోమని సలహా యిచ్చారు మంచిది. అంతేకానీ అతనుతో మాట్లావద్దనడానికి మీరెవరు? ఇలా పర్సనల్ విషయాల్లో కూడా మీ సలహాలు ఇవ్వడం ఏమీ బాగాలేదు" అంటూ ఆయన సమాధానాన్ని ఎదురు చూడకుండా విసవిస వెళ్లిపోయింది కవిత.
ఇలా అందరికీ శ్రీరంగనీతులు చెప్పే రంగనాధం ఉన్నట్లుండి ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో ఆయన విద్యార్థులతోపాటు కవితా ఊపిరి పీల్చుకున్నారు. తమకు శ్రీరంగ నీతుల బెడద వదిలినందుకు ఎంతో సంతోషపడ్డారు.
కాలం గడుస్తోంది. కాస్త సుస్తీగా ఉన్నందుకు పట్నంలోని హాస్పిటల్ కు బయలుదేరాడు శ్రీరంగనాధం మాస్టారు. ఆ ఊరు అంతకుముందు తాను చదువు చెప్పిన ఊరు కావడంతో తనకు తెలిసినవారు ఎవరైనా కనబడతారేమోనని చూశాడు. మహిళల వార్డు వద్ద తనకు పరిచయమైన ముఖం కనబడేసరికి అటుగా వెళ్లాడు.
మాస్టారును గమనించిన కవిత ముఖం చాటేసేందుకు ప్రయత్నించింది. అయినా వదలని మాస్టారు.... " ఏమ్మా కవితా... నిన్ను చూసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. కోర్సు పూర్తి చేశావా? ఉద్యోగం ఎలా ఉంది?" అంటూ ఆప్యాయంగా అడిగాడు.
"ఆ రోజు మీమాటలు నాకు విసుగు తెప్పించాయి. కానీ ఆ మాటలు విననందువల్ల నా జీవితం నాశనం అయ్యింది. మా ఇద్దరి సంగతి కంపెనీలో తెలియడంతో మమ్మల్ని ఉద్యోగం నుంచి తప్పించారు. అతను నన్ను వదిలేసి ఎంచక్కా వాళ్ల సొంత ఊరుకు చెక్కేశాడు..." అంటూ భోరున విలపిస్తున్న ఆమె వైపు అవాక్కయి చూస్తుండిపోయాడు పాపం రంగనాధం.
|